
సాక్షి, హైదరాబాద్ : హిందూ మతంపై దాడికి పాల్పడుతున్న కంచ ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని వత్సల అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి పోలీసులను ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ కేసును ఈ నెల 12కు వాయిదా వేశారు.
కాగా ఐలయ్య హిందూవాదంపై పుస్తకాలు ప్రచురిస్తూ అక్రమ లబ్ధి పొందుతున్నారని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టి.రామకృష్ణ వేసిన పిటిషన్కు విచారణార్హత ఉందో లేదో తెలపాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.