
సాక్షి, అమరావతి: అమరావతి, విజయవాడలో సుమారు 50 ఎకరాల్లో హెచ్సీఎల్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తామని హెచ్సీఎల్ కంపెనీ చైర్మన్ శివనాడార్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. మంగళవారం సచివాలయంలో శివనాడార్ సీఎంతో సమావేశమై రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న హెచ్సీఎల్ క్యాంపస్లపై చర్చించారు. విజయవాడ విమానాశ్రయం సమీపంలో నిర్మించే కొత్త భవన డిజైన్లపై ఆయన ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. కలంకారీ నేత, కొండపల్లి బొమ్మలు ప్రతిబింబించేలా హెచ్సీఎల్ కొత్త భవంతులను నిర్మిస్తామన్నారు. రూ.750 కోట్లతో రెండు దశల్లో నిర్మాణం చేపడతామని, 7,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 2019 జూన్కు విజయవాడ క్యాంపస్ సిద్ధమవుతుందన్నారు.