మంత్రి ప్రత్తిపాటి కంపెనీలో అగ్నిప్రమాదం
గణపవరం స్వాతి కాటన్ మిల్లులో 7 వేల డీలింగ్ బేళ్లు అగ్నికి ఆహుతి
రూ.3.5 కోట్లు నష్టం!
నాదెండ్ల (చిలకలూరిపేట): మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన స్వాతి కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్ డివిజన్ సీడ్ గోడౌన్లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 7 వేల డీలింట్ కాటన్ బేళ్లు అగ్నికి ఆహుతవగా, సుమారు రూ.3.5 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. గుంటూరు జిల్లా గణపవరంలోని వేలూరు రోడ్డులో మంత్రి ప్రత్తిపాటికి శివస్వాతి టెక్స్టైల్స్, స్వాతి కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మిల్లులున్నాయి.
ఆదివారం అర్ధరాత్రి సీడ్ గోడౌన్లో మంటలు వ్యాపించాయి. నైట్ వాచ్మెన్లు మేనేజ్మెంట్ సిబ్బందికి సమాచారం అందించారు. నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. అనంతరం మరో నాలుగు ఫైరింజన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు మంత్రి మిల్లును పరిశీలించారు.