
కర్నూలు మండలం నందనపల్లి వద్ద దెబ్బతిన్న బొప్పాయి తోట
కర్నూలు(అగ్రికల్చర్): బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుపాను ప్రభావంతో జిల్లాలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కూడా కురిశాయి. పెనుగాలుల తీవ్రతకు ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. భారీవృక్షాలు సైతం కూకటివేళ్లతో సహా నేలకూలాయి. పండ్ల తోటలు దాదాపు 650 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు సమాచారం. పెనుగాలులకు దాదాపు రూ.35 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సంభవించిన గాలివాన బీభత్సం వల్ల అనేక గ్రామాల్లో జనజీవనానికి ఆటంకం కల్గింది. వందలాది విద్యుత్ స్తంభాలు నేలకూలడంతోపలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ అధికారులు, సిబ్బంది బుధవారం తీవ్రంగా శ్రమించారు.
10.8 మి.మీ వర్షపాతం
జిల్లా మొత్తం మీద 10.8 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షపాతం నమోదైంది. ఆదోనిలో అత్యధికంగా 59.4 మి.మీ వర్షం కురిసింది. హాలహర్వి 54.8, పెద్దకడబూరు 48.2, ఆలూరు 48.2, సి.బెళగల్ 46.2, ఎమ్మిగనూరు 38.0, కోడుమూరు 29.2, పత్తికొండ 23.4, గోనెగండ్ల 22.8, దేవనకొండ 22.8, కోసిగి 19.4, వెలుగోడు 17.4, అవుకు 17.2, మంత్రాలయం 15.8, వెల్దుర్తి 15.4, నందవరంలో 14.0 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. మొత్తమ్మీద 31 మండలాల్లో వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. భారీ వర్షం కారణంగా హాలహర్వి మండలం బిలేహాల్ చెరువుకు గండి పడింది. వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గాయి. నందవరంలో అత్యధికంగా 40.75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వర్షాలకు రైతులు వ్యవసాయ పనులు చేపడుతున్నారు.
ఉద్యాన తోటలకు అపార నష్టం
పెనుగాలుల తీవ్రత వల్ల ఉద్యాన తోటలకు భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా అరటి తోటలు విరిగి పడ్డాయి. ఒక్క మహానంది మండలంలోనే దాదాపు 300 ఎకరాల్లో అరటి, మునగ తోటలు దెబ్బతిన్నాయి. ఉద్యాన శాఖ అధికారులు పంట నష్టం సర్వేలో నిమగ్నమయ్యారు. పండ్లతోటలకు జరిగిన నష్టంపై పూర్తి వివరాలు గురువారానికి తెలుస్తాయని ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) రమణ తెలిపారు. కాగా.. ఉద్యాన శాఖ నంద్యాల డివిజన్ పరిధిలోనే దాదాపు 600 ఎకరాల్లో పండ్లతోటలు దెబ్బతిన్నట్లు సమాచారం. నంద్యాల, ఓర్వకల్లు, బేతంచెర్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, పాణ్యం మండలాల్లో అరటి, మామిడి వంటి పంటలకు నష్టం వాటిల్లింది. ఇక కర్నూలు డివిజన్లో 50 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ప్యాపిలి, ఎమ్మిగనూరు, పత్తికొండ, కృష్ణగిరి, మంత్రాలయం తదితర మండలాల్లో పండ్లతోటలు దెబ్బతినడంతో పాటు భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలాయి.