
ఫాదర్స్డే రోజున తండ్రి ఓ ఘాతుకం
నాన్న అంటే అండ, ఏకష్టమొచ్చినా నేనున్నానంటూ మన వెన్నుతట్టి మనల్ని ముందుకు నడిపిస్తాడు.
► భార్యా, ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య
► ముగ్గురి మృతి మరో ఇద్దరి పరిస్థితి విషమం
విజయవాడ: నాన్న అంటే అండ, ఏకష్టమొచ్చినా నేనున్నానంటూ మన వెన్నుతట్టి మనల్ని ముందుకు నడిపిస్తాడు. మన కోసం తను కష్టపడుతూ మనకు సంతోషాన్ని అందించడానికి నిరంతరం పరితపిస్తాడు. అలాంటిది ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కన్న బిడ్డలను విషమిచ్చి తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ నగరంలో ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యతో పాటు ముగ్గురు పిల్లలకు విషమిచ్చి అనంతరం తాను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని కృష్ణలంకలోని రణదివే నగర్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సురేష్(30), యశోద(28) దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి కుమారుడు అమీర్ పుట్టినరోజు వేడుకలు జరిపిన అనంతరం సురేష్ తన భార్యా ముగ్గురు పిల్లలకు విషం కలిపిన ఆహరం ఇచ్చి తర్వాత తాను కూడా ఆ ఆహారం తీసుకున్నాడు. అయితే వీరిలో సురేష్, యశోదతో పాటు కుమారుడు అమీర్(10) మృతిచెందగా.. ఇద్దరు కుమార్తెల పరిస్థితి విషమంగా మారింది. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.