అలా ‘బుక్‌’ అయ్యారు..! | Sakshi
Sakshi News home page

అలా ‘బుక్‌’ అయ్యారు..!

Published Mon, Jun 15 2020 2:42 PM

Devineni Uma Maheswara Rao Miss Lead With Fake Book - Sakshi

సాక్షి, అమరావతి : పాఠ్య పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోలు ముద్రించారని, న్యాయస్థానం ఆదేశాలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అభాసుపాలయ్యారు. ఉమా శనివారం మీడియా సమావేశంలో పాఠ్య పుస్తకమంటూ ఓ పుస్తకాన్ని చూపించారు. వాస్తవానికది పాఠ్యపుస్తకం కాదు. విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ‘వారధి’ పేరుతో బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తోంది. కరోనా నేపథ్యంలో దూరదర్శన్‌ సప్తగిరి చానెల్‌లో బ్రిడ్జి కోర్సు వీడియోలను ఈనెల 10వ తేదీనుంచి ప్రసారం చేస్తున్నారు. బ్రిడ్జి కోర్సు మెటీరియల్‌కు సంబంధించి ఒక పుస్తకం అట్టపై ముఖ్యమంత్రి జగన్‌ ఫొటో ఉండటాన్ని ప్రస్తావిస్తూ దేవినేని ఉమా విమర్శలు చేశారు. (అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం)

అయితే ఆయన చూపించిన బ్రిడ్జి కోర్సు పుస్తకంపైనే వారధి అని స్పష్టంగా ఉండటం గమనార్హం. కాగా బ్రిడ్జి కోర్సులు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన మెటీరియల్‌పై సీఎం ఫొటోలు ఉండటం ఇప్పుడేమీ కొత్తకాదు. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రతి పుస్తకంపైనా ఇలాంటి ఫొటోలు ముద్రించుకున్నారు. ‘అభ్యసన ఫలితాలు (లెర్నింగ్‌ అవుట్‌ కమ్స్‌ క్లాస్‌ 1 – 8) పేరిట సర్వశిక్ష అభియాన్‌ ద్వారా రూపొందించిన పుస్తకంపై చంద్రబాబు తదితరులతో పాటు నారా లోకేష్‌ ఫొటోను కూడా ముద్రించారు.  

Advertisement
Advertisement