పోలీస్ కస్టడీకి హర్షవర్దన్ బృందం | Sakshi
Sakshi News home page

పోలీస్ కస్టడీకి హర్షవర్దన్ బృందం

Published Wed, Sep 17 2014 3:31 AM

పోలీస్ కస్టడీకి హర్షవర్దన్ బృందం

 ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : పెదవేగి మండలం దుగ్గిరాలలోని డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బాలను బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న టీవీ యూంకర్ యండ్రపాటి హర్షవర్దన్, అతని బృందాన్ని విచారణ నిమిత్తం ఏలూరు పోలీసులు మంగళవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని జైలు నుంచి టూటౌన్ పోలీసులు తీసుకెళ్లారు. ఈనెల 7న ఫాదర్ బాలను బెదిరించి, రూ. 5 కోట్లు డిమాండ్ చేసిన కేసులో హర్షవర్దన్, నల్లజర్లకు చెందిన లూక్‌బాబు, హేలాపురి న్యూస్ విలేకరులు బోడా విజయకుమార్, దిరిసిపాముల విజయరత్నం, ఏలూరుకు చెందిన కారు విడిభాగాల వ్యాపారి అధినేత వీరంకి చిరంజీవి అనే వారిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. వారిని కోర్టులో హాజరుపర్చగా 15 రోజులు రిమాండ్ విధించారు. ఆ తరువాత తన ఫొటోను ఒక యువతి ఫొటోతో మార్ఫింగ్ చేసి తననుంచి రూ.13 లక్షల వసూలు చేశారంటూ విజయవాడలో రైల్వే ఇంజినీర్‌గా పనిచేస్తున్న నాతా హరినాథ్‌బాబు ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ ని మిత్తం హర్షవర్దన్, అతని బృంద సభ్యులను తమ కస్టడీకి అప్పగించాలంటూ టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టు సూచన మేరకు సబ్‌జైలు నుంచి పోలీసులు తీసుకెళ్లారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement