కరోనా: జంతువులకు కరోనా రాకుండా..

Coronavirus: Nallamala Forest Tourism Closed In Prakasam District - Sakshi

ఘాట్‌రోడ్డు, ఇష్టకామేశ్వరి గుడి, ఎకో టూరిజం, నడకమార్గం మూసివేత 

డీఎఫ్‌ఓ ఖాదర్‌బాషా 

సాక్షి, మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, ఇతర వన్యప్రాణులకు కరోనా వైరస్‌ సోకకుండా అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలానికి వెళ్లే ఘాట్‌రోడ్డు, నడకమార్గం, ఇష్టకామేశ్వరి గుడి, ఎకో టూరిజం మూసేశారు. ప్రస్తుతం వాహనాల రద్దీ పూర్తిగా లేకపోవడంతో వన్యప్రాణులన్నీ రోడ్లపైకి వస్తున్నాయి. నల్లమలలో సుమారు 48 పెద్ద పులులు, 60కి పైగా చిరుత పులులు ఉన్నాయి. వేల సంఖ్యలో జింకలు, దుప్పులు, వందల సంఖ్యలో ఎలుగుబంట్లు ఉన్నాయి. వీటికి కరోనా వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అటవీ సమీప గ్రామాలలోని ప్రజలకు సిబ్బంది ద్వారా కరపత్రాలు పంచి అవగాహన కలి్పస్తున్నారు. ఇష్టకామేశ్వరి, ఎకోటూరిజం ప్రాంతాలను మూసివేయడంతో భక్తులు, సందర్శకుల రాక నిలిచిపోయింది. వేసవి కాలం కావడంతో నీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 24 బేస్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేసి 120 మంది టైగర్‌ ట్రాకర్‌లను నియమించి పులుల కదలికపై నిఘాపెట్టారు. చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని ఎక్కువగా నియమించి ఎవ్వరినీ అటవీ ప్రాంతంలోకి పంపకుండా చర్యలు తీసుకున్నారు.

వివిధ ప్రాంతాల్లో జంతువులకు నీటిని అందించేందుకు సాసర్‌పిట్‌లను ఏర్పాటు చేసి ట్యాంకర్‌ల ద్వారా నీటిని నింపుతూ జంతువులకు నీటి సమస్య లేకుండా చేస్తున్నారు. పట్ట్టణాల్లో ఉన్న కోతులను ఇటీవల అటవీ ప్రాంతానికి తరలించారు. వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటూ పండ్లను అందిస్తున్నారు. చిన్న మంతనాల, చింతల, పెద్ద మంతనాల ప్రాంతాల్లో కోతుల కోసం స్టాల్‌ఫీట్స్‌ను ఏర్పాటు చేశారు.  

ప్రత్యేక చర్యలు తీసుకున్నాం
వన్య ప్రాణులకు కరోనా వైరస్‌ సోకకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం. అడవిలోకి ఎవరినీ పంపడంలేదు. సిబ్బందిని అలర్ట్‌ చేశాం. కరపత్రాల ద్వారా అటవీ సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కలి్పస్తున్నాం.  – ఖాదర్‌బాషా, డీఎఫ్‌ఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top