కానుక..పొందలేక

Chandranna Kanuka Delayed in Chittoor - Sakshi

క్రిస్మస్‌ కానుకలు పొందేందుకు లబ్ధిదారులకు ఇక్కట్లు

కార్డు ఉన్న చోటే తీసుకోవాలనడంతో ఇబ్బందులు

వెసులుబాటు కల్పించాలని లబ్ధిదారుల వేడుకోలు

పట్టించుకోని అధికారులు

చంద్రన్న క్రిస్మస్‌ కానుకలు అందుకు నేందుకు లబ్ధిదారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. కార్డు వేరే చోట ఉన్నా పోర్టబులిటీ విధానం ద్వారా తాముం టున్న ప్రాంతంలోనే లబ్ధిదారులు రేషన్‌ తీసుకొనేవారు. అయితే, క్రిస్మస్‌ సందర్భంగా ఇస్తున్న కానుకలను కార్డు ఉన్న చోటే తీసుకోవాల్సి రావడంతో సమస్య నెలకొంది. దీనిపై లబ్ధిదారులు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

చిత్తూరు రూరల్‌: జిల్లాలో 2,896 రేషన్‌షాపులు ఉన్నాయి. వీటి కింద 11.16 లక్షల కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెలా ప్రజా పంపిణీ పేరుతో నిత్యావసర సరుకులను అంది స్తోంది. ప్రస్తుతం ఈ–పాస్‌ విధానం ద్వారా పంపిణీ జరుగుతోంది. ఈ విధానానికి ప్రభుత్వం 2015లో శ్రీకారం చుట్టింది. దీంతో కార్డు ఉన్న ప్రాంతంలోనే కాకుండా వేరే చోట కూడా సరుకులు పొందేందుకు పోర్టబులిటీ సిస్టం ప్రవేశపెట్టింది. జిల్లాలో సుమారు 2.50 లక్షల కార్డుదారులు పోర్టబులిటీ ద్వారా కార్డు ఉన్న ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో సరుకులు తీసుకుంటున్నారు.

పోర్టబులిటీ లేక ఇక్కట్లు
చంద్రన్న క్రిస్మస్‌ కానుకల పంపిణీకి మాత్రం పోర్టబులిటీ ఆప్షన్‌ లేకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో తెల్లరేషన్‌ కార్డు కలిగిన ప్రతి ఇంటికి ప్రభుత్వం క్రిస్మస్, సంక్రాతి కానుకలను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో కార్డుకు కిలో గోధుమ పిండి, కిలో కంది పప్పు, అరకిలో శనగపప్పు, 100 గ్రాముల నెయ్యి, అరలీటరు వంట నూనె, అరకిలో బెల్లం అందజేయాలని ఆదేశాలు వచ్చాయి. జిల్లాకు 994.108 మెట్రిక్‌ టన్నుల గోధుమ పిండి, కందిపప్పు 306.950 మెట్రిక్‌ టన్నులు, శనగపప్పు 221.110 మెట్రిక్‌ టన్నులు, బెల్లం 352.712 మెట్రిక్‌ టన్నులు, పామాయిల్‌ 552.426 కిలో లీటర్లు, నెయ్యి 106.431 కిలో లీటర్లు సరఫరా అయ్యాయి. 3 రోజుల క్రితమే సరుకులు చౌకదుకాణాలకు చేరుకున్నాయి. శనివారం నుంచి పంపిణీ ప్రారంభించారు. కానీ పోర్టబులిటీ ద్వారా సరుకులు తీసుకునే వారికి బ్రేకులు పడ్డాయి. ఈ–పాస్‌లో పోర్టబులిటీ ఆప్షన్‌ లేకపోవడంతో లబ్ధిదారులు తమ రేషన్‌ కార్డు ఉన్న ప్రాంతాలకు వెళ్లి క్రిస్మస్‌ కానుక పొం దేందుకు అవస్థలు పడుతున్నారు. చౌకదుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. షాపు వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. కానుకలు తీసుకునేందుకు కూడా పోర్టబులిటీ విధానం అమలుచేయాలని వారు కోరుతున్నారు.

పేదలకే కష్టం
సరుకులు ఎక్కడైనా తీసుకోవచ్చం టూ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం బాగుంది. పేదప్రజలకు ఊరట కలిగింది. కానీ పండుగ సరుకులు తీసుకోవడంలో ఆంక్షలు పెట్టడం సరికాదు. ప్రభుత్వం స్పందించాలి. పోర్టబులిటీ ద్వారా సరుకులు అందించాలి.       – రాజారత్నంరెడ్డి, చిత్తూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top