లారీ వద్ద భారీగా చెలరేగిన మంటలు
కుప్పం రోడ్డులో గంటపాటు స్తంభించిన ట్రాఫిక్
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు– కుప్పం రహదారిలో బురిశెట్టిపల్లి క్రాస్ వద్ద ఓ లారీ శనివారం దగ్ధమైంది. లారీతోపాటు అందులోని స్టీల్ పౌడర్ పూర్తిగా కాలి బూడిదైంది. డ్రైవర్ కిందకు దిగేయడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. స్టీల్ పౌడర్తో లారీ తమిళనాడులోని తూత్తుకూడి నుంచి తాడిపత్రికి బయలుదేరింది.
వి.కోట వద్ద కర్ణాటక పెట్రోల్ బంకులో డీజిల్ నింపుకొని వస్తుండగా బురిశెట్టిపల్లి వద్ద లారీలోంచి వాసన రావడంతో డ్రైవర్ ఆపాడు. ఇంతలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అగ్నిమాపక వాహనం వచ్చే సరికి పూర్తిగా దగ్ధమైంది. గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు రూ.40 లక్షల వరకూ నష్టం వాటిల్లిందని లారీ డ్రైవర్ ఆదినారాయణ తెలిపాడు.


