భర్తను వదిలేసి.. బావతో వివాహేతర సంబంధం..! | Shocking Incident in Chittoor | Sakshi
Sakshi News home page

భర్తను వదిలేసి.. బావతో వివాహేతర సంబంధం..!

Jul 12 2026 11:40 AM | Updated on Jul 12 2026 12:29 PM

Shocking Incident in Chittoor

రక్తసంబంధమే రక్షణగా నిల వాల్సిన చోట.. అదే బంధం ప్రాణాలు తీసిన విషాద ఘటన  విజయపురం మండలం ఇల్లత్తూరులో వెలుగుచూసింది. ఇల్లత్తూరుకు చెందిన నిరోష (26) అనే వివాహిత ఈనెల 7వ తేదీ రాత్రి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిరోష మరణం వెనుక దాగి ఉన్న అసలు నిజాన్ని పోలీసులు బయటపెట్టారు. 

ఈ కేసులో హంతకుడు మరెవరో కాదు... ఆమె సొంత బావ నాగరాజు (27) అని తేలడంతో గ్రామస్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. సీఐ భాస్కర్‌ కథనం మేరకు మొదట నిరోష మృతదేహం లభ్యమైనప్పుడు అది సహజ మరణమా? ఆత్మహత్యా? లేక ప్రమాదమా? అనే అనుమానాల తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ప్రతి ఆధారాన్ని నిశితంగా పరిశీలిస్తూ ముందుకెళ్లిన విచారణ బృందానికి ఒక్కో క్లూ.. ఒక్కో నిజాన్ని బయటపెట్టింది. 

అనుమానాస్పద మృతిగా నమోదైన కేసు చివరకు హత్య కేసుగా మారింది. దీంతో ఎస్పీ తుషార్‌ డూడీ, ఇన్‌చార్జి డీఎస్పీ రాంబాబు ఆదేశాల మేరకు విజయపురం ఎస్‌ఐ వెంకటసుబ్బ య్య, నిండ్ర ఎస్‌ఐ మల్లికార్జున నేతృత్వంలో వెవ్వేరు బృందాలను దర్యాప్తునకు సీఐ ఏర్పాటుచేశారు. దర్యాప్తులో నిందితుడు మృతురాలి సొంత బావేనని గుర్తించిన పోలీసులు శనివారం ఉదయం తిరుత్తణి నాగలాపురం రోడ్డులో కాళికాపురం క్రాస్‌ వద్ద అత డిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. విచారణలో నిందితుడు నేరా న్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

సన్నిహిత సంబంధంతో మొదలై.. ప్రాణం తీసిన పగ 
పోలీసుల వివరాల ప్రకారం.. భర్తను వీడి మూడేళ్లు ఒంటరిగా జీవిస్తున్న నిరోష తన మేనమామ కుమారుడు నాగరాజుతో సన్నిహిత సంబంధం ఏర్పరుచుకుంది. దీంతో వివాహం చేసుకోవాలని నిందితుడు భావించాడు. పలుమార్లు ఒత్తిడి తెచ్చాడు. అయితే నిరోష నిరాకరిస్తూ వచ్చింది. 

ఇటీవల ఆమె తిరువళ్లూరులో తాను పనిచేసే ప్రాంతంలో పరిచయమైన వసంత్‌ అనే వ్యక్తితో జీవితాన్ని కొనసాగించబోతున్నట్లు, అతన్నే వివాహం చేసుకోనున్నట్లు కరాఖండిగా తెలపడంతో తీవ్ర ఆవేశానికి గురైన నిందితుడు కక్ష పెంచుకున్నాడు. ఈనెల 7వ తేదీ రాత్రి నిరోష ఇంటికి వెళ్లి తనకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదని గొంతు గట్టిగా నొక్కడం, పెనుగులాటలో కిందపడిపోగా హీటర్‌ వైరును మెడకు బిగించి హత్యకు పాల్పడినట్లు వెల్లడైంది. నేరం జరిగిన తీరును, ఎలా తప్పించుకోవాలని ప్రయత్నించాడో కూడా నిందితుడు పోలీసుల ఎదుట వివరించినట్లు సమాచారం. శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలు, విచారణలో లభించిన కీలక సమాచారంతో పోలీసులు కేసును వేగంగా ఛేదించారు. 

శనివారం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. అత్యంత క్లిష్టమైన ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించిన దర్యాప్తు అధికారులైన సీఐ, ఎస్‌ఐలను  పోలీసులు దేవరాజులు, ప్రతాప్, ఎలుమలై, కళ్యాణ్‌ కుమార్, సతీష్‌ అయ్యప్పలను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ ఘటనతో ఇల్లత్తూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకోగా, ‘కాపాడాల్సిన బంధమే కాటేసింది’ అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినవాళ్లే హత్యకు పాల్పడడంతో పిల్లలను ఎవరు పోషిస్తారన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది.  

విజయపురం (చిత్తూరు  )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement