భార్య, ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి ఇంటి యజమాని ఆత్మహత్య
టీవీ స్క్రీన్పై డెత్ నోట్ రాసి బలవన్మరణం
భార్య ఆరోగ్యం క్షీణించడంతో తీవ్ర నిర్ణయం
చిత్తూరు మండలం బంగారెడ్డిపల్లిలో విషాదం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం బంగారెడ్డిపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం విషాదాన్ని నింపింది. భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో పిల్లల భవిష్యత్పై ఆందోళన చెందిన కుటుంబ యజమాని తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగారెడ్డిపల్లికి చెందిన దాము (34) మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య నిర్మల (28) కొన్నేళ్లుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వీరికి దిలీప్ (14), శ్రీవిద్య (12) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చికిత్స చేయించినా నిర్మల ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం దాము తన భార్య నిర్మల, పిల్లలు దిలీప్, శ్రీవిద్యలకు విషం ఇచ్చి.. అతడు ఇంట్లోనే ఉరివేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఉదయం వరకు ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు తలుపులు పగులగొట్టి చూడగా నలుగురు విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
టీవీపై సూసైడ్ నోట్
ఆత్మహత్యకు ముందు దాము టీవీ స్క్రీన్పై రాసిన సూసైడ్ నోట్ స్థానికులను కలచివేసింది. ‘మా చావుకు ఎవరూ కారణం కాదు. నా బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులతోనే మా నలుగురి అంత్యక్రియలు పూర్తి చేయండి’ అని తన ఫోన్పే పిన్ నంబర్ రాసి పెట్టాడు.


