డేటా స్కాంలోనూ బాబు యూటర్న్‌! | Chandrababu U turn also in Data Scam | Sakshi
Sakshi News home page

డేటా స్కాంలోనూ బాబు యూటర్న్‌!

Mar 9 2019 5:05 AM | Updated on Mar 28 2019 5:27 PM

Chandrababu U turn also in Data Scam - Sakshi

సాక్షి, అమరావతి: గూగుల్‌ ఇమేజ్‌ సెర్చ్‌లోకి వెళ్లి యూ టర్న్‌ అంకుల్‌ అని టైప్‌ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటోలు దర్శనమిస్తాయి. యూటర్న్‌ విషయంలో అంతర్జాతీయంగా ఆయన అంత క్రేజ్‌ సంపాదించుకున్నారు. దీనికి మరింత సార్థకత తీసుకువచ్చేలా డేటా చోరీ విషయంలోనూ చంద్రబాబు యూటర్న్‌ తీసుకోవడం సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. కోట్లాది మంది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమాచారం హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌ అనే సంస్థ వద్ద ఉందంటూ లోకేష్‌రెడ్డి అనే సామాజిక కార్యకర్త సైబరాబాద్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి సహా, ప్రభుత్వ ఉన్నతాధికారులంతా రాష్ట్రానికి చెందిన ఎటువంటి సమాచారం పోలేదని, అంతా భద్రంగా ఉందంటూ మీడియాకు చెప్పారు. (సవాల్‌ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..!)

అసలు సమాచారం దొంగతనమే జరగనప్పుడు కేసులేంటి, దర్యాప్తేంటి అంటూ ఎదురుదాడి కూడా చేశారు. అంతేకాదు.. హైదరాబాద్‌ కంపెనీలో పనిచేస్తున్న తమ బంధువులు కనపడడం లేదంటూ ఇక్కడ పెదకాకాని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, విచారణ కోసం ఏసీపీ స్థాయి అధికారులు ఫిర్యాదు అందిన రెండు మూడు గంటల్లోనే హైదరాబాద్‌లో దర్యాప్తు చేయడం.. హైకోర్టులో పిటిషన్‌ వేయడం చకచకా జరిగిపోయాయి. కానీ, తెలంగాణ పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందని తేలడంతో సీఎం చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. తమ సమాచారాన్ని దొంగిలించారంటూ తెలుగుదేశం పార్టీ గుంటూరులో ఫిర్యాదు చేసింది. (స్కాం ‘సునామీ’.. లోకేశ్‌ బినామీ!?)

ఆ వెంటనే ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సిట్‌ ఏర్పాటుచేసింది. అసలు సమాచారం పోలేదన్న వాళ్లే ఇప్పుడు ఇలా ఫిర్యాదు చేయడంతో ‘బాబు మరోసారి యూటర్న్‌’ అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రజలను ఎలాగోలా అయోమయానికి గురిచేసి దీన్ని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement