చంద్రబాబు దాగుడుమూతలు | chandrababu naidu tight lipped on rayala telangana | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దాగుడుమూతలు

Dec 3 2013 12:21 AM | Updated on Mar 18 2019 9:02 PM

చంద్రబాబు దాగుడుమూతలు - Sakshi

చంద్రబాబు దాగుడుమూతలు

తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయటం ద్వారా కేంద్రానికి బ్లాంక్ చెక్ ఇచ్చిన చంద్రబాబు... తాజాగా రాయల తెలంగాణ పేరుతో రాయలసీమను నిట్టనిలువునా చీల్చాలని చేస్తున్న ప్రయత్నాలపై నోరు మెదపడంలేదు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయటం ద్వారా కేంద్రానికి బ్లాంక్ చెక్ ఇచ్చిన చంద్రబాబు... తాజాగా రాయల తెలంగాణ పేరుతో రాయలసీమను నిట్టనిలువునా చీల్చాలని చేస్తున్న ప్రయత్నాలపై నోరు మెదపడంలేదు. సీమవాసులు, తెలంగాణ వాదులు రాయల తెలంగాణ ప్రతిపాదనలను బహిరంగంగానే వ్యతిరేస్తున్న సంగతి తెలిసిందే. ఆ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ కేవలం రాజకీయ లక్ష్యంతో కాంగ్రెస్ హైకమాండ్ పావులు కదుపుతున్నప్పటికీ టీడీపీ అధినేత స్పందించకపోవడం వెనుక ఆంతర్యమేదో ఉందన్న అభిప్రాయం పార్టీవర్గాల్లో వినిపిస్తోంది.

పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలన్న అంశంపై సీడబ్ల్యూసీ నిర్ణయానికి రావడానికి ముందు కాంగ్రెస్ పెద్దలు పలువురు చంద్రబాబుతో మాట్లాడినట్లు అప్పట్లో జాతీయ పత్రికల్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఏర్పాటు చేసి మూడు నెలలుగా రకరకాల కసరత్తులను చేస్తూ రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి ప్రతిపాదనలు కూడా తీసుకుంది. జీవోఎం ముందు అన్నిపార్టీలు హాజరైనప్పటికీ టీడీపీ వెళ్లలేదు. పది జిల్లాలతో తెలంగాణపై నిర్ణయం ఉంటుందని చెబుతూ వచ్చిన కేంద్రం తాజాగా అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా చంద్రబాబు మౌనం పాటించడంపై సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ నిర్ణయాలన్నింటికీ ఆయన ఆమోదముద్ర వేస్తున్నారన్న అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. తెలంగాణ, రాయల తెలంగాణ వంటి కీలకాంశాల  నుంచి తప్పించుకోవడానికో లేదా పక్కదారి పట్టించడానికో చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం గతంలో తెలంగాణ ప్రకటన చేసిన తరువాత తామే అడ్డుకున్నామనే అపవాదుతో ప్రజల్లోకి వెళ్లలేకపోయామని, ఇపుడు ఏదో ఒక రకంగా ప్రజల్లోకి వెళుతుంటే ప్రస్తుతం రాయల తెలంగాణ అంశంపై అధినేత మౌనంగా ఉండటం దేనికి సంకేతమో తమకు అర్థం కావటం లేదని తెలంగాణ నేతలు అంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఏ సంస్థ సర్వే నిర్వహించినా పది నుంచి పదిహేను అసెంబ్లీ సీట్లు మినహా టీడీపీకి రావని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ రాయల తెలంగాణను ఏర్పా టు చే స్తే ఫలితాలు కొంచెమైనా తమకు అనుకూలిస్తాయన్న నమ్మకంతో అధినేత ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లుందని టీటీడీపీ నేత వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement