విజయవాడలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
* 49 మంది మహిళలకు ఆటోల పంపిణీ
* విజయవాడలో వినూత్న ప్రయోగం
విజయవాడ: విజయవాడలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పురుషులకు ధీటుగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని, అన్ని రంగాల్లో రాణించాలన్న ఉద్దేశంతో ఆయన వారికి పెద్దఎత్తున ఆటో రిక్షాలు పంపిణీ చేశారు. బెజవాడలోని తన క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు శుక్రవారం ‘షి ఆటో’ పథకం కింద ఆటో రిక్షాలను అందించారు. 49 మంది మహిళలకు సుమారు రూ. కోటి విలువ చేసే ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు.
పూర్తిగా సీఎన్జీతో నడిచే ఈ ఆటోలు పర్యావరణ రహితమే కాకుండా, మహిళా ప్రయాణికులకు రక్షణ కల్పించడానికి 'షి ఆటో' దోహదపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మహిళా ఆటో డ్రైవర్లు.. చంద్రబాబును శాలువా కప్పి సత్కరించారు. రూ.1,91,000 విలువ చేసే ఈ ఆటోలకు 7 శాతం సబ్సిడీ అందించిన ప్రభుత్వం.. మిగిలిన మొత్తాన్ని 40 ఇన్స్టాల్మెంట్లలో నెలకు రూ.4,500 చొప్పున చెల్లించే అవకాశం కల్పించింది. నెలకు రూ. 18 వేల వరకు ఆటోలు నడపడం ద్వారా లబ్దిదారులు ఆర్జించవచ్చని అధికారులు చెప్పారు.