ఆర్టీసీ నష్టానికి బాబే కారణం | chandra babu naidu reason to become RTC loss | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ నష్టానికి బాబే కారణం

Apr 13 2014 2:32 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఆర్టీసీ నష్టానికి బాబే కారణం - Sakshi

ఆర్టీసీ నష్టానికి బాబే కారణం

ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లడానికి నాటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి విమర్శించారు.

వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి ధ్వజం
 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లడానికి నాటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ఓటేస్తే ఆర్టీసీని అమ్మేస్తాడని అనుమానం వ్యక్తంచేశారు. శనివారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ టీయూసీ అధ్యక్షుడు జనక్‌ప్రసాద్‌తో కలిసి రాజారెడ్డి విలేకరులతో మాట్లాడారు.

 ఆర్టీసీని రక్షించేలా, ఉద్యోగ భద్రత ఉండేలా, వేతన సవరణతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని శాశ్వత ఉద్యోగులుగా పరిగణించేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించామన్నారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని రాజారెడ్డి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు జగన్ పక్షానే ఉంటారన్నారు. కార్మికులు జగన్ పట్ల ఉత్సాహం కనబరుస్తున్నారని ఆయన చెప్పారు.
 
 చంద్రబాబుతో నిర్వీర్యమైపోయింది..
 ఆర్టీసీని ఆరుజోన్లుగా విడదీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని, అందువల్లే సంస్థ నష్టాల్లోకి వెళ్లిపోయిందని రాజారెడ్డి తెలిపారు. ఆర్టీసీలోకి ప్రైవేట్ వాహనాల్ని అనుమతించేలా జీవో జారీ చేశారని గుర్తుచేశారు. 24 రోజులు కార్మికులు సమ్మె చేస్తే కేవలం 9 శాతం జీతం పెంచారని, అయినా ప్రభుత్వ ఉద్యోగుల కంటే వెనకబడి ఉన్నారని గుర్తుచేశారు. 2001లో కార్మికుల సమ్మె కాలంలో ఆర్టీసీకి 50శాతం ప్రభుత్వ రాయితీని చెల్లిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. తన పదవీ కాలంలో ఒక్కపైసా కూడా చెల్లించలేదని, అందువల్లే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. ప్రభుత్వానికి అప్పట్లో 5శాతం ఆర్టీసీ పన్ను చెల్లిస్తుంటే చంద్రబాబు దానిని 15 శాతానికి తీసుకువెళ్లి పుట్టి ముంచేశారని గుర్తుచేశారు. 616 జీవో ద్వారా 20 వేల మ్యాక్సీ క్యాబ్‌లకు బాబు అనుమతిచ్చేందుకు ప్రయత్నం చేశారని, అది నిజమైతే ఇప్పుడు ఆర్టీసీ పరిస్థితి జీరో అయిపోయేదన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement