'బాబు ఎన్టీఆర్ ఘాట్ను వాడుకుంటున్నారు' | Chandra babu Naidu is using NTR Ghat for political mileage, says Lakshmi Parvathi | Sakshi
Sakshi News home page

'బాబు ఎన్టీఆర్ ఘాట్ను వాడుకుంటున్నారు'

Oct 7 2013 10:37 AM | Updated on Jul 28 2018 6:33 PM

'బాబు ఎన్టీఆర్ ఘాట్ను వాడుకుంటున్నారు' - Sakshi

'బాబు ఎన్టీఆర్ ఘాట్ను వాడుకుంటున్నారు'

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  చంద్రబాబునాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం ప్రతిసారి ఎన్టీఆర్ ఘాట్ను వాడుకుంటుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు ఏమి అమలు చేశారని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చంద్రబాబు వస్తున్నారో చెప్పాలని ఆమె సోమవారమిక్కడ నిలదీశారు.

తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని ఎన్టీఆర్ అనుకున్నారని.....అలాంటిది విభజనకు ఒప్పుకున్నాక ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చంద్రబాబు రావడం ఎందుకు అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. స్వార్థం కోసమే ఢిల్లీలో బాబు దీక్ష చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జాతీయ నేతలను పిలిపించుకుని...తన పలుకుబడి చూపించడానికే బాబు దీక్ష చేస్తున్నారన్నారు.

చంద్రబాబులా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన నేత మరొకరు లేరని లక్ష్మీపార్వతి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్గంలోనే టీడీపీ కూడా పయనించాలన్నారు. ఆర్టికల్ 3 విషయంలో వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టడం సరికాదని అన్నారు. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆర్టికల్ 3 గురించి తెలియదా అని లక్ష్మి పార్వతి సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించనందునే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబునాయుడు ఢిల్లీలో దీక్ష చేపడుతున్న సందర్బంగా ఈరోజు ఉదయం  నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు నివాళులర్పించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement