కీసర జాతరకు ఏర్పాట్లు ముమ్మరం | busy arrangements to kisara jatara | Sakshi
Sakshi News home page

కీసర జాతరకు ఏర్పాట్లు ముమ్మరం

Feb 14 2014 11:30 PM | Updated on Oct 8 2018 4:35 PM

ఈనెల 25 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరుగనున్న కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

కీసర, న్యూస్‌లైన్: ఈనెల 25 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరుగనున్న కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పా ట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆలయ గోపురాలకు, మహా మండపానికి పంచరంగులు వేస్తున్నారు. ఈ పనుల కోసం తమిళనాడు నుంచి ప్రత్యేకంగా కార్మికులను రప్పించారు. క్యూలైన్ల పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. భక్తులు సేద తీరేందుకు చలువపందిళ్లు వేస్తున్నారు. కీసరగుట్ట, ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి దిగువ గుట్ట వరకు విడిది చేసే యాత్రికుల సౌకర్యార్థం గతంలో ఏర్పాటు చేసిన కులాయిలకు ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ, పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మరమ్మతు లు ప్రారంభించారు.


 గతంలో నిర్మించిన మినీ ట్యాంకులను శుభ్రం చేయడంతోపాటు మరమ్మతులు చేపడుతున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ వెంకటరమణ తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌లైన్ల వద్ద విద్యుత్ సిబ్బంది మరమ్మతులు మొదలుపెట్టారు. జాతర సందర్భంగా 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు బిగించే ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. పార్కింగ్, ఆర్టీసీ బస్టాం డ్, క్రీడాప్రాంగణం, ఎగ్జిబిషన్ స్టాల్స్ వద్ద చదును చేసే పనులు, మరుగుదొడ్ల ఏర్పాటు, స్నానఘట్టాల ఏర్పాటు తదితర పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పనులు చేపట్టేందుకు కలెక్టర్ కార్యాలయం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉందని, ఒకటిరెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

 జాతరను విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన వివిధ కమిటీల పనితీరును ఈనెల 18న జేసీ చంపాలాల్  క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈనెల 18 లోపు రంగులు వేసే పనులను పూర్తవుతాయని ఆలయ చైర్మన్ తటాకం రమేష్‌శర్మ, ఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement