రెండు రాష్ట్రాలా.. నాలుగు రాష్ట్రాలా? | brijesh kumar tribunal inquiry on krishna river water dispute | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాలా.. నాలుగు రాష్ట్రాలా?

Nov 27 2014 1:00 AM | Updated on Nov 9 2018 5:41 PM

కృష్ణా నదీ జలాల వివాదంపై గురువారం మరోమారు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ నిర్వహించనుంది.

* కృష్ణాజల వివాదాల్లో రాష్ట్రాల పరిధిపై నేడు మరోమారు బ్రజేష్ ట్రిబ్యునల్ విచారణ

సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదంపై గురువారం మరోమారు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వివాదాలకే విచారణను పరిమితం చేయాలా, మహారాష్ట్ర, కర్ణాటకలను  చేర్చాలా అన్న దానిపై ట్రిబ్యునల్ అందరి వాదనలు విననుంది. ఇందులో కేంద్రం వెల్లడించే నిర్ణయమే కీలకం కానుంది. 

రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలన్నది బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. దీనిపై గతంలో జరిగిన విచారణ సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరింది. ఏపీ, తెలంగాణలు నాలుగు రాష్ట్రాలకు కలిపి కేటాయింపులు జరపాలని కోరగా, కర్ణాటక, మహారాష్ట్ర వ్యతిరేకించాయి. దీంతో కేంద్రం చేసే నిర్ణయం కీలకంగా మారింది.

దీనిపై గతంలో ట్రిబ్యునల్‌కు లేఖ రాసిన కేంద్రం, రెండు రాష్ట్రాలకే విచారణను పరిమితం చేయాలని తెలిపింది. నివేదిక రూపంలో అభిప్రాయాన్ని చెప్పాలని ట్రిబ్యునల్ సూచించినా అది జరుగలేదు. కాగా, కృష్ణా జలాలపై బ్రజేష్ ట్రిబ్యునల్ ఇచ్చి తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదంటూ రాష్ట్రం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ వచ్చే నెల 1 న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement