నాడు ఇటుకల వ్యాపారి..నేడు అంతర్‌ రాష్ట్ర స్మగ్లర్‌ | Sakshi
Sakshi News home page

నాడు ఇటుకల వ్యాపారి..నేడు అంతర్‌ రాష్ట్ర స్మగ్లర్‌

Published Thu, Apr 12 2018 12:11 PM

Brick Businessman Was An Intelligent State Smuggler - Sakshi

కడప అర్బన్‌ : అతను ఒకప్పుడు ఇటుకల వ్యాపారి.. ఆ తర్వాత రూటు మార్చి ఎర్రచందనం స్మగ్లర్‌ అవతారమెత్తాడు. అంతర్‌రాష్ట్ర స్మగ్లర్‌గా పేరుమోసి చివరకు పోలీసుల చేత చిక్కి కటకటాలపాలయ్యాడు. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా ఆరణి పట్టణానికి చెందిన సత్యనారాయణ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ సునీల్‌ అలియాస్‌ ఆర్కాట్‌భాయ్‌కి ప్రధాన అనుచరుడిగా చలామణి అయ్యాడు. జిల్లాలోని రైల్వేకోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లె ప్రాంతాల్లో స్మగ్లర్ల ద్వారా నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను చాకచక్యంగా తీసుకెళ్లడంలో ఘనాపాటి.

తమిళనాడులోని ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని ఉడ్‌ కట్టర్లను రాయలసీమ జిల్లాల్లోని శేషాచలం, లంకమల్ల, నల్లమల అటవీ ప్రాంతాల్లోకి పంపించి వారి ద్వారా ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణాకు ప్పాడినట్లు విచారణలో తేలింది. నాలుగు  సంవత్సరాల నుంచి ఇప్పటివరకు సత్యనారాయణ దాదాపు 500 టన్నుల ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసినట్లు తెలిసింది. జిల్లాలో ఇప్పటివరకు ఇతనిపై 25 కేసులు నమోదయ్యాయి. ఇతనికి దుబాయికి చెందిన పేరుమోసిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ అలీభాయ్, షాజిలతో సంబంధాలు ఉన్నాయి.
నిందితుడు పట్టుబడిన వైనం
ఇటీవల ఆర్కాట్‌భాయ్‌ని రైల్వేకోడూరు పోలీసులు అరెస్టు చేసి విచారించగా, ప్రస్తుతం పట్టుబడిన నిందితుడు సత్యనారాయణ ఎర్రచందనం అక్రమ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆ మేరకు వ్యూహాత్మకంగా రెండు స్పెషల్‌ పార్టీ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అతని కదలికలపై నిఘా ఉంచి ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లాలోని అరణి పట్టణంలో  వలపన్ని అరెస్టు చేశారు. అతని వాంగ్మూలం మేరకు రైల్వేకోడూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో వాగేటికోన సమీపంలో శేషాచలం అటవీ ప్రాంతంలో గతంలో దాచి ఉంచిన టన్ను (1035 కిలోలు) బరువుగల 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని అరెస్టు చేయడంలో కృషి చేసిన జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) అద్నాన్‌ నయీం అస్మి, ఫ్యాక్షన్‌ జోన్‌ డీఎస్పీ బి.శ్రీనివాసులు, రాజంపేట డీఎస్పీ లక్ష్మినారాయణ, సీఐ పద్మనాభన్, ఎస్‌ఐలు బి.హేమకుమార్, కొండారెడ్డి, కానిస్టేబుళ్లు ఎస్‌.శివరామనాయుడు, జి.వెంకట రమణ, సి.కొండయ్య, బి.గోపినాయక్, ఎస్‌.ప్రసాద్‌బాబు, కిరణ్‌కుమార్, సుబ్రమణ్యం, పి.రాకేష్‌లను ఎస్పీ బాబూజీ అట్టాడ అభినందించారు.అరెస్టు వివరాలను వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ (ఇన్‌సెట్‌)అంతర్‌ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌ సత్యనారాయణ 

Advertisement
Advertisement