
సాక్షి,విజయవాడ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు నోరుజారి నాలిక కరుచుకున్నారు. ఎన్నికల వేళ తనదైన సహజ శైలిలో ఒక వైద్యుడుపై విరుచుకుపడ్డారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఉదయం పూట మాచవరం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక మంది వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇటీవల వారిని కలిసేందుకు బొండా ఉమామహేశ్వరరావు వెళ్లారు. అయితే అక్కడే ఉన్న చుట్టుగుంటకు చెందిన ఒక వైద్యుడ్ని చూడగానే ఆగ్రహంతో ఊగిపోయాడు. సుమారు పావుగంట సేపు నోటికి వచ్చినట్లు దూషించాడు. ఆ వైద్యుడు కన్నీళ్ల పర్యంతం అయిన విషయం విదితమే. బ్రాహ్మణ సంఘాలు నగరంలో మౌన ప్రదర్శన చేశాయి. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని రాజకీయ పరిశీలకు భావించారు.
వైద్యుడ్ని ఇంటికి పిలిపించుకుని....
దీంతో తాను చేసిన తప్పును తెలుసుకుని ఆయన్ను కలిస్తే విచారం వ్యక్తం చేస్తే సరిపోయేది. అయితే అందుకు భిన్నంగా ఆయన్నే తన ఇంటికి పిలిపించుకున్నారు. ఆయన తన కుటుంబసభ్యుడేనంటూ అందరికీ చెప్పుకున్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఆయన్ను తాను ఏమీ అనలేదని బుకాయించి నమ్మించే ప్రయత్నం చేశారు. అంతేకాదు సుమారు 70 ఏళ్లు ఆ వైద్యుడు చేత కూడా ఏమీ జరగలేదని చెప్పించారు. దీన్నంతా వీడియోగా రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
వాస్తవం ‘ఉమామహేశ్వరుడుకే’ ఎరుక!
ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఒక వైద్యుడ్ని నోటికి వచ్చినట్లు దూషించడమే వాకర్స్ అంతా ప్రత్యక్షంగా చూశారు. బొండా వెళ్లిపోయిన తరువాత ఆయన కన్నీళ్ల పర్యంతమైతే సాటి వాకర్సే ఆయన్ను ఓదార్చారు. తరువాత ఆయన హాస్పటల్కు వెళ్లి విచారం వ్యక్తం చేసి వచ్చారు. అయితే ఇమేమీ జరగనట్లు బొండా బుకాయించడం చర్చనీయాశంగా మారింది. అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ తరువాత ఆయన్ను ఇంటికి ఎందుకు పిలిపించాల్సి వచ్చిందనేది ఆ పైన ఉన్న ఉమామహేశ్వరుడేకే తెలుసునని బ్రాహ్మణ సామాజిక వర్గంలో చర్చించుకుంటున్నారు.