రాజకీయ సన్యాసం తీసుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బెట్టిం గులను ప్రోత్సహించేందుకే ఓ పార్టీకి అనుకూలంగా సర్వే ఫలితాలంటూ ప్రకటిస్తున్నారని వైఎస్సార్ సీపీ గుడివాడ నియోజకవర్గ సమన్వయకర్త కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) విమర్శించారు.
గుడివాడ : రాజకీయ సన్యాసం తీసుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బెట్టిం గులను ప్రోత్సహించేందుకే ఓ పార్టీకి అనుకూలంగా సర్వే ఫలితాలంటూ ప్రకటిస్తున్నారని వైఎస్సార్ సీపీ గుడివాడ నియోజకవర్గ సమన్వయకర్త కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టంచేశారు. లగడపాటి సర్వేలను ప్రజలు నమ్మి బెట్టింగులకు పాల్పడి మోసపోవద్దని సూచించారు.
స్థానిక పార్టీ కార్యాలయంలో నాని బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ గాలి ఉన్నందున అన్ని సర్వేలు జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తున్నారని తేల్చిచెబుతుండటంతో పందేలు కాసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని, దీంతో లగడపాటి తప్పుడు సర్వేలు ప్రకటించి అమాయకులను మోసగించేందుకు చూస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జయాపజయాలకు అనేక కారణాలు ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థి గుణగణాలతోపాటు, ఆర్థిక, సామాజిక అంశాలు, పార్టీ కేడర్ను బట్టి గెలుపు ఓటములు ఉంటాయని వివరించారు. సాధారణ ఎన్నికల్లో ఈ అంశాలేవీ ప్రభావం చూపబోవని, వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టంచేశారు.