నేడు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ డబ్బుల్లేవని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రం విడిపోయినప్పుడు పరిస్థితి...
మంగళగిరి: ‘నేడు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ డబ్బుల్లేవని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రం విడిపోయినప్పుడు పరిస్థితి తెలియకుండానే నోటికొచ్చిన వాగ్దానం చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందారా..’ అని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ప్రశ్నించారు. పట్టణంలోని ఆయన కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్షనాయకుడిగా ప్రపంచానికి పాఠాలు చెప్పాననే చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థికపరిస్థితి గురించి తెలియకుండానే వాగ్దానాలు ఇచ్చారంటే ప్రజలు నమ్మేపరిస్థితి లేద న్నారు.
తొలి రుణమాఫీ పూర్తికాకుండా నే రెండవ విడత రుణమాఫీ అంటూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ల పేరులతో రైతులను ముంచిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. సింగపూర్ ప్రధాని మృతికి అసెంబ్లీ సంతాపం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని సంప్రదాయాన్ని అసెంబ్లీలో ప్రేవేశపెట్టడం చూస్తుంటే సింగపూర్ రాజకీయ నాయకులకు చంద్రబాబుకు వున్న రహస్య సంబధాలు బయటపడ్డాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో రాజధాని వీధులకు, రోడ్లకు సింగపూర్, జపాన్ నాయకులు పెడతారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.