నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు
అందులో ఎన్నికలప్పుడు ఇచ్చిన బాండ్లు, డీఎస్సీ స్కామ్ ప్రస్తావన
ప్రభుత్వ అవినీతి గురించి ప్రజలకు వివరిస్తాం
మోసాలు, అన్యాయాలు, దగా స్కామ్లపై ప్లకార్డుల ప్రదర్శన
పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు
సాక్షి, అమరావతి: ‘మేనిఫెస్టోను డెస్ట్బిన్లో వేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు రెండేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా దగా పడ్డారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చాం. ఈ ర్యాలీల్లో ప్రభుత్వ అవినీతి గురించి ప్రజలకు వివరిస్తాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై దుమ్మెత్తి పోశారు.
తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆందోళనల్లో డీఎస్సీ అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నామని, పరీక్ష నిర్వహణలో అక్రమాల వల్ల జరిగిన నష్టాన్ని ప్లకార్డులతో ఎత్తి చూపుతామన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని గుర్తు చేశారు. ‘నిరుద్యోగ యువతకు నెల నెలా రూ.3 వేలు ఇస్తామన్నారు. రూ.3 వేల మాట దేవుడెరుగు.. వాళ్లకు హక్కు(రైట్పుల్)గా రావాల్సిన ఉద్యోగాలను సైతం ఇవ్వకుండా లాక్కొని స్కామ్లు చేశారు.
అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలన్నీ పక్కన పడేశారు. బాబు పాలనలో రైతులు అన్ని విధాలుగా అధోగతి పాలయ్యారు. మహిళలు నాశనమైపోయారు. యువత ఆశలను నిర్దాక్షిణ్యంగా చిదిమేశారు. దగా పడ్డ ప్రజలకు న్యాయం చేయనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది’ అని తెలిపారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలతో, ఎన్నికల్లో వారిచ్చిన బాండ్లతో పాటు డీఎస్సీలో జరిగిన మోసాలు, అన్యాయాలు, దగా స్కామ్లను ప్రదర్శిస్తూ ప్రజలకు సంఘీభావంగా ప్రతి నియోజకవర్గంలో తలపెట్టిన ఈ నిరసన ర్యాలీలు గట్టిగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చామన్నారు. చంద్రబాబు పాలనలో దగాపడిన అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ ర్యాలీలు నిర్వహిస్తారన్నారు. దగా పడిన రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులందరూ ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు.


