పురందేశ్వరి ఏమైనా ఇంజనీరా?
పోలవరంపై ఆమెకేం తెలుసు?
మంత్రి అయ్యన్నపాత్రుడు
సాక్షి, విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టుపై కాఫర్ డ్యాం నిర్మాణం అవసరం లేదంటూ బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి సీహెచ్.అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. కాఫర్ డ్యాం గురించి మాట్లాడడానికి ఆమె ఇంజనీరా? ఆమెకేం తెలుసని ప్రశ్నించారు. విశాఖలో జరుగుతున్న అగ్రి హ్యాక్థాన్ సదస్సు ప్రాంగణంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మరో బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా పోలవరం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
బీజేపీలో ఉన్న సిసలైన నాయకులెవరూ పోలవరం ప్రాజెక్టు గురించి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని, కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా బీజేపీలో చేరిన వీరు డూప్లికేట్ నాయకులని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాకుండా వీరు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వీరికి సత్తా ఉంటే విమర్శలు మాని కేంద్రం నుంచి పోలవరానికి, రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణంపై గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.