ఏపీ: పల్లెల్లో పంటల కొనుగోళ్లు | Sakshi
Sakshi News home page

పల్లెల్లో పంటల కొనుగోళ్లు

Published Mon, Apr 13 2020 10:02 AM

AP Govt Direct Purchase of Maize From Farmers Amid Lockdown - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో పంటల కొనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం శనగలు, కందులు, జొన్న, మొక్కజొన్న, పసుపు, అపరాల కొనుగోలుకు మండల స్థాయిలో  కేంద్రాలను ఏర్పాటుచేసింది. కానీ, ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపథ్యంలో రైతులు తమ పంటలను ఈ కేంద్రాలకు తరలించడానికి ఇబ్బందిపడే అవకాశాలు ఉండటంతో గ్రామస్థాయిలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌  ఆదేశించారు. దీంతో 786 కేంద్రాల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్‌ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 700 కేంద్రాలను పెట్టగా.. మిగిలినవి రెండు మూడ్రోజుల్లో ఏర్పాటుకానున్నాయి.

అంతేకాక..
► ఈ కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ లేకుండా చేసేందుకు రైతుల పేర్లను అధికారులు ముందుగా నమోదు చేసుకోవాలి.  
► నిర్ణయించిన సమయం, తేదీల్లోనే రైతులు తమ పంటలను ఈ కేంద్రాలకు తరలించాలి.
► అలాగే, గతంలో రెండు, మూడు ఏజెన్సీలే పంటలను కొనుగోలు చేస్తే.. ఇప్పుడు స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సర్కారు అనుమతిస్తోంది.

మొక్కజొన్న కొనుగోలుకు నిర్ణయం
► రాష్ట్రంలో 3.64 లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు 350 కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
► 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల జొన్న కొనుగోలుకు 95 కేంద్రాలను ఏర్పాటుచేసింది.  
► శనగలకు 185, కందులకు 140, పసుపుకు 11, అపరాలకు 5 కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
► ఇక క్వింటాల్‌ మొక్కజొన్నకు రూ.1,760 లు.. క్వింటాల్‌ జొన్నకు రూ.2,550లను ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది.  
► ఇప్పటి దాకా రైతుల నుంచి కొనుగోలు చేసిన శనగల్లో 14,500 మెట్రిక్‌ టన్నులను మార్క్‌ఫెడ్‌ పౌర సరఫరాల శాఖకు సరఫరా చేస్తోంది.  
► పంటను కొనుగోలు చేసే ఏజెన్సీలను వాటి ట్రాక్‌ రికార్డు ఆధారంగా ఖరారు చేశారు.

గ్రామస్థాయిలో ఏర్పాట్లు పూర్తి:  రద్యుమ్న, మార్క్‌ఫెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌
కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు గ్రామస్థాయిలో చర్యలు తీసుకున్నాం. వర్షాలవల్ల పంట దెబ్బతినకుండా కొనుగోలు చేసిన పంటలను మండల కేంద్రాల్లోని గోదాములకు తరలిస్తాం. హమాలీల సమస్య లేకుండా వ్యవసాయ కార్మికులను ఏజెన్సీలు వినియోగించుకునే ఏర్పాటు కూడా చేశాం. కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణకు రైతులు ముందుగానే పేర్లను నమోదు చేసుకోవాలి. 

కరోనా: రోజుకు వెయ్యి పరీక్షలు!

Advertisement
Advertisement