మరొకరి పరీక్ష రాస్తూ.. | Another candidate instead of the candidate caught writing vro test | Sakshi
Sakshi News home page

మరొకరి పరీక్ష రాస్తూ..

Feb 3 2014 3:23 AM | Updated on Aug 29 2018 1:59 PM

ఒక అభ్యర్థికి బదులు వీఆర్‌ఓ పరీక్ష రాస్తూ మరో అభ్యర్థి పట్టుబడ్డాడు. బొబ్బిలి మం డలం కలువరాయి స్వామి వివేకానంద ఇంజినీరింగ్

కలువరాయి(బొబ్బిలిరూరల్),న్యూస్‌లైన్: ఒక అభ్యర్థికి బదులు వీఆర్‌ఓ పరీక్ష రాస్తూ  మరో అభ్యర్థి పట్టుబడ్డాడు. బొబ్బిలి మం డలం కలువరాయి స్వామి వివేకానంద ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన వీఆర్‌ఓ పరీక్షల్లో  ఈ సంఘటన జరిగింది. ఎస్.కోట మండలం బాలకృష్ణరాజపురం గ్రామానికి చెందిన ముచ్చకర్ల కల్యాణ్‌కుమార్‌కు బదులు పొడుగు ప్రసా ద్ అనే అభ్యర్థి పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. 203వ నంబర్ పరీక్షాకేంద్రంలో పరీక్ష జరుగుతున్న సమయంలో 102140363 హాల్‌టికెట్ అభ్యర్థి పేరు ఓఎంఆర్ షీట్‌లో కల్యాణ్‌కుమార్ అని ఉండగా, పరీక్షరాస్తున్న అభ్యర్థి ప్రసాద్ అని సంతకం చేశాడు. 
 
 అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్ వి.గోవిందరావు గుర్తించి వెంటనే చీఫ్‌సూపరింటెండెంట్ చుక్క రమణకు విషయం తెలియజేయడంతో అప్రమత్తమైన లైజనింగ్ అధికారి ఎస్.రమేష్ తదితరులు అభ్యర్థిని ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అసలు అభ్యర్థి కల్యాణ్‌కుమార్ ఎవరో వివరాలు చెప్పాలని కోరినా ప్రసాద్ విషయం చెప్పకపోవడంతో హాల్‌టికెట్లు పరిశీలించారు. ప్రసాద్ వద్ద ఉన్న హాల్‌టికెట్‌లో అభ్యర్థి పేరు సరిచేసి ఉండడం, వివరాలుకూడా సరిచేసి తయారుచేసిన హాల్‌టికెట్‌కావడంతో  వెంటనే బొబ్బిలి సీఐ రఘుశ్రీనివాస్‌కు సమాచారం అందించారు. కళాశాలకు వచ్చిన హాల్‌టికెట్, ప్రసాద్ వద్ద ఉన్న హాల్‌టికెట్లలో సీరియల్ నంబరు సరిపోగా అభ్యర్థి పేరు కల్యాణ్‌కుమార్‌కు బదులుప్రసాద్ అని, 
 
 తండ్రిపేరు సత్యనారాయణకు బదులు రాంబాబు అని, పుట్టిన తేదీ 13.06.1987కు బదులు 4.1.1995, కులం బీసీడీ కాగా, ఎస్సీ అని ఉన్నాయి. అయితే ప్రసాద్ తయారుచేసిన హాల్‌టికెట్లో అడ్రసు కల్యాణ్‌కుమార్‌దే ఉంది.  సీఐ రఘుశ్రీనివాస్, ఎస్సై శేఖర్ నకిలీ అభ్యర్థి  పొడుగు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని, కేసునమోదుచేసి  విచారణ చేస్తున్నారు. అలాగే ఎస్.కోట చెందిన వి.శ్రీను విజయనగరంలోని ఎంఆర్ అటానమస్ కళాశాలలో వీఆర్వో పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ప్రారంభమైన తరువాత  ఆ అభ్యర్థి పలుమార్లు బయటకు వెళ్లడాన్ని, జేబురుమాలు తీసి రాస్తుండడాన్ని ఇన్విజిలేటర్ గుర్తించి రుమాలు ఇమ్మని అడిగినా అభ్యర్థి ఇవ్వలేదు. ఇంతలో కేంద్రానికి చేరుకున్న సర్వీసు కమిషన్ అధికారులు రుమాలును స్వాధీనం చేసుకున్నారు. ఆ రుమాలులో ఏకంగా 40 ప్రశ్నలకు సంబంధించిన జవాబులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో  ఆ అభ్యర్థిని డీబార్ చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement