ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 56 లక్షల బోగస్ ఓట్లను గుర్తించామని, వీటన్నింటినీ త్వరలో తొలగిస్తామని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ తెలిపారు.
మదనపల్లె రూరల్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 56 లక్షల బోగస్ ఓట్లను గుర్తించామని, వీటన్నింటినీ త్వరలో తొలగిస్తామని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో శనివారం విలేకరులతో మాట్లాడారు. అర్హులందరూ నవంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ లోపు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. వయస్సు 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు కావడానికి అర్హులని చెప్పారు. ఓటరు కార్డులో మార్పులు సరిచేసుకునేందుకు కూడా అవకాశం కల్పించినట్లు తెలిపారు.
నవంబర్ 1 నుంచి 4 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు బూత్లెవల్ అధికారులు(బీఎల్వో) ఆయా పోలింగ్ సెంటర్ల వద్ద అందుబాటులో ఉంటారన్నారు. 2016 జనవరి 11న కొత్త ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారని తెలిపారు. అదే నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్ల గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తారని చెప్పారు. జిల్లాకు సరాసరి 2 నుంచి 3 లక్షల వరకు బోగస్ ఓటర్లను తొలగిస్తామని తెలిపారు.