గుంటూరులో కురుక్షేత్ర సభ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
గుంటూరు: గుంటూరులో కురుక్షేత్ర సభ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎస్సీల వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో నేడు జరగనున్న కురుక్షేత్రం మహాసభకు కార్యకర్తలు రాకుండా పోలీసుల ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. సభకు వెళ్లే దారుల్లో పలు చోట్లు పోలీస్ చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి ఎమ్మార్పీఎస్ నాయకులను అరెస్ట్లు చేస్తున్నారు. కృష్ణ జిల్లా నుంచి సభకు వస్తున్న పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నందిగామ, పిడుగురాళ్ల, గూడవల్లి, మాచర్ల ప్రాంతాల్లో పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గుంటూరు అర్బన్ జిల్లా వరకు 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసుల అరెస్ట్లకు, నిర్బంధాలకు భయపడేది లేదని.. ఎట్టి పరిస్థితుల్లోను కురుక్షేత్ర మహాసభ జరిపితీరుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సభకు అనుమతి ఇవ్వకపోవడం చంద్రబాబు కుట్ర అని ఆరోపించారు. అంతకుముందు కురుక్షేత్ర మహాసభ కోసం ఎమ్మార్పీఎస్ నాయకులు పోలీసులను అనుమతి కోరగా.. అదే సమయంలో ఎమ్మార్పీఎస్ నాయకులకు అనుమతి ఇస్తే అదే ప్రాంతంలో మేము కూడ మహాసభ ఏర్పాటు చేస్తామని మాలమహానాడు నేతలు అనడంతో.. పోలీసులు రెండు వర్గాలకు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.