
దిలావర్పూర్(నిర్మల్): కాలం కలిసిరాక.. సాగుకు తెచ్చిన అప్పులు తీర్చే దారి తెలియక ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యు లు,పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు కోండ్రు రాజారెడ్డి(36) తనకున్న మూడెకరాల భూమికి తోడు మరో తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. రెం డేళ్లుగా ప్రకృతి సహకరించకపోడంతో పాటు పంటలకు చీడపీడలు ఆశించి పెట్టుబడి సైతం అందక అప్పు ల పాలయ్యాడు.
సుమారు రూ.లక్ష వరకు బ్యాంకురుణం, బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి మరో రూ.లక్ష అప్పు తెచ్చాడు. మరో రూ.మూడు లక్షల వరకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద తెచ్చిన పేరకుపోవడంతో వాటిని ఎలా తీర్చేదని నిత్యం మదనపడుతుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు భార్య మమత మూడు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఉదయం తల్లిదండ్రులకు పొలంకు వెళ్తున్నానని చెప్పి రాజారెడ్డి బయలుదేరాడు. చేనుకు ఆనుకుని ఉన్న చెట్టుకు మృతదేహం వేలాడుతుండడం చూసిన సమీప రైతులు విషయాన్ని సర్పంచ్ విఠల్, తదితరులకు చెప్పగా వారు అక్కడికి వెళ్లారు. మృతుడు రాజారెడ్డిగా గుర్తించారు. వెంటనే ఎస్సై హరిబాబు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఎనిమిదేళ్ల కుమారుడు జయకేతన్రెడ్డి ఉన్నాడు. ఘటనా స్థలాన్ని ఎమ్మారై రాము, వీఆర్వో శ్రీనివాస్రెడ్డి పరిశీలించి రైతు ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.