అమ్మప్రేమ ఆయువు పోసింది | Matti Maya Tamang meets with her son Zoyal Ghale two Days | Sakshi
Sakshi News home page

అమ్మప్రేమ ఆయువు పోసింది

Aug 30 2026 4:27 AM | Updated on Aug 30 2026 4:27 AM

Matti Maya Tamang meets with her son Zoyal Ghale two Days

నేపాల్‌ వరదలు

వాడు చెట్టు దిగలేదు. కింద రాకాసి వరద. వాడు కొమ్మ వదల్లేదు. రాత్రయ్యింది. చీకటి. వాడు ధైర్యాన్ని చొక్కా పైజేబులో ఉంచి గట్టిగా పట్టుకున్నాడు. ఎనిమిదేళ్ల పిల్లవాడు. నేపాల్‌ వరద సునామీకి దడవకుండా వాళ్లమ్మ కోసం ప్రాణం ఉగ్గపట్టుకున్నాడు. పర్వతం కూడా వాడికి తలఒంచింది. నేపాల్‌లో ఈ త్రివిక్రమ బాలుడు అందరినీ సంతోషంలో ముంచెత్తాడు.

ఆగస్టు ఇరవై ఆరు, బుధవారం... ఉత్తర నేపాల్‌లోని రసువా. ఎనిమిదేళ్ల జోయల్‌ ఘాలే ఉదయం ఎప్పటిలాగే తన తమ్ముడితో కలిసి స్కూలు వ్యాన్‌ ఎక్కి బడికి వెళ్లాడు. తల్లి మాయా తమంగ్‌ (28) పిల్లల్ని బడికి పంపించి రోజూలాగే ఇంట్లో కూర్చుని మగ్గం నేస్తూ ఉంది. 

మరికాసేపటికి భూమి అదిరింది.
భారీ చప్పుడు. 
ఏంటది? తల్లి ఉలిక్కిపడింది.

జరిగిందేమిటో అర్థం కావడానికి తల్లికే కాదు ఊరికీ చాలాసేపు పట్టింది. ల్యాంగ్‌టాంగ్‌ లిరుంగ్‌ పర్వత శిఖరం దగ్గరి ఐస్‌ గ్లేసియర్‌ ఒక్కసారిగా కుప్పకూలి ఒక రాకాసిలా మారి కిందకు దూకింది. మంచు, రాళ్లతో కలిసి బురదరూపం దాల్చి ఉప్పెనలాగా లోయలోకి దూసుకొచ్చింది. దాని దెబ్బకి భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. సూర్యుడి వెలుతురుకు అడ్డం పడుతూ భారీగా ఊరి మీద విరుచుకు పడ్డాయి. ఆ సమయానికి జోయల్‌ క్లాస్‌లో ఉన్నాడు. వాడికి చురుకు జాస్తి. 

ఏదో కొంప ముంచుకు వచ్చిందని ఒక్కసారిగా చుట్టుముట్టిన కారుచీకటిని చూడగానే అర్థమైంది. స్కూల్‌ బిల్డింగ్‌ కూలిపోతుంటే జోయల్‌ తన ఫ్రెండ్‌తో కలిసి  ప్రాణభయంతో అడవిలోకి పరుగెత్తాడు. దూసుకొస్తున్న బురద నీటికి దొరకకుండా ఉండటానికి చలిలో వణుకుతూ చెట్ల పైకి ఎక్కి కూర్చున్నాడు. పది నిమిషాలకు కుదుట పడ్డాడు. ఫ్రెండు ఏమయ్యాడో తెలియదు. చెట్టు దిగితే తన గతి అదేనని వాడికి తెలుసు. ఏమైనా సరే చెట్టు దిగకూడదు. అమ్మ వచ్చే దాకా దిగనే దిగడు.

తల్లి వెతుకులాట
ప్రమాదం జరిగిన వెంటనే తల్లి మాయా తమంగ్‌ పిచ్చిదానిలా పిల్లలు ఉన్న స్కూలు వైపు పరుగెత్తింది. సాధారణంగా కారులో వెళ్తే పదిహేను నిమిషాలు పట్టే ఆ దారి హఠాత్‌ ప్రళయం వల్ల బురదకుప్పలా మారిపోయింది. స్కూలు ఎక్కడుందో కూడా అర్థం కాలేదు. అక్కడ ఎటు చూసినా ఉధృతంగా ప్రవహించే నీరు, పెద్ద పెద్ద రాళ్లు, మోకాళ్ల లోతు బురద మాత్రమే కనిపించాయి’ అని ఆ తల్లి రాయిటర్స్‌ ప్రతినిధులతో అంది. తన కళ్ల ముందే సర్వస్వం కొట్టుకుపోతుంటే, తన ఇద్దరు బిడ్డలు కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటారని ఆమె గుండె పగిలేలా ఏడ్చింది.

ఒక ఫోన్‌ కాల్‌తో తిరిగొచ్చిన  ప్రాణం!
మరోవైపు మాయా తమంగ్‌ తన బిడ్డల కోసం ఒక సహాయక శిబిరం నుండి మరో శిబిరానికి తిరుగుతోంది. నాలుగు శిబిరాల్లో కూడా పిల్లల పేర్లు లేకపోవడంతో, వాళ్లు చనిపోయారని ఆశ వదులుకుంది. ‘ఏడవడం తప్ప నేను ఏమీ చేయలేకపోయాను’ అని ఆమె చెప్పింది. ఆ సమయంలో ఎవరో ఇచ్చిన సమాచారంతో  ప్రతినిధి సహానాకు ఫోన్‌ చేసింది.‘నీ పెద్ద కొడుకు జోయల్‌ బతికే ఉన్నాడు, చికిత్స కోసం ఖట్మాండూ ఆసుపత్రికి తరలించారు’ అని వినగానే నమ్మలేకపోయింది. అప్పటికే ఆమె చిన్న కొడుకు కూడా సురక్షితంగా దొరికాడు. శుక్రవారం నాడు బెడ్‌పై ఉన్న జోయల్‌ని చూడగానే ఆ తల్లి సంతోషానికి పగ్గాల్లేవు. నవ్వూ... ఏడుపూ.... ‘నా  ప్రాణం మళ్లీ తిరిగొచ్చినట్టు అయింది’ అంది కనునవ్వుతో.

నేపాల్‌ కొండ వరదల వల్ల రసువా జిల్లాలో వందలాది మంది మరణించగా, వేలాది మంది అదృశ్యమయ్యారు. కానీ, మాయా తమంగ్‌కు ప్రకృతి ఆమె ఇద్దరు బిడ్డల్ని దోసిలిలో ఉంచి తిరిగి అప్పజెప్పింది. జపాన్ లో కన్స్‌ట్రక్షన్‌ పనిలో ఉన్న జోయల్‌ తండ్రి కూడా కొడుకును చూడటానికి నేపాల్‌కు బయలుదేరాడు. ఆసుపత్రి బెడ్‌పై కాలు విరిగి ఉన్నా, నవ్వుతూ ఉన్న కొడుకును చూసి.. ‘వీడు ఎప్పుడూ ఇంతే, భయం అంటే తెలీదు, వీడికి ఎముకలు విరగడం ఇది మొదటిసారి కాదు’ అని ఆ తల్లి నవ్వుతూ అన్న మాటలు విపత్తును గెలిచిన మాతృత్వానికి, ఆ పసివాడి అజేయమైన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. 
                                                                    
చిచ్చరపిడుగు
సాయంత్రమైపోయింది. చీకటి పడింది. చెట్టు మీద ఉన్న జోయల్‌ చెట్టు దిగలేదు. భయపడలేదు. పట్టుజారి నీటిలో పడలేదు. అమ్మను చేరాలి వాడు. అంతే. ఎలాగైనా చేరతాడు కూడా. మరుసటి రోజు గురువారం ఉదయం నిఘా దళాలు అడవిలో ఉన్న జోయల్‌ను చూశాయి. ‘ఒరేయ్‌... మీ అమ్మ పిలుస్తోంది రా’ అన్నాయి. అపనమ్మకం కొద్ది, వాళ్ల వెంట వెళ్లడానికి కూడా వాడు రెడీ కాలేదు. వాణ్ణి ఒప్పించడానికి పోలీసులు వాడి చేతిలో రెండు పది రూపాయల నోట్లు పెట్టారు. హెలికాప్టర్‌ ద్వారా నువాకోట్‌ జిల్లాలోని చిన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికి వాడి కుడి కాలు విరిగిపోయింది, ముఖంపై గాయాలు ఉన్నాయి.  అయినా సరే జోయల్‌ ఆ ఇరవై రూపాయలను తన ఎడమ చేతితో గట్టిగా పట్టుకుని ఆసుపత్రి బెడ్‌పై తల్లి కోసం చూస్తున్నాడు. కాని తల్లి ఎక్కడ ఉందో... అసలు ఉందో లేదో తెలియదు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక న్యూస్‌రిపోర్టర్‌ సహానా బజ్రాచార్య, జోయల్‌ని చూసి చలించిపోయింది. వాడి వీడియో తీసి వాళ్లమ్మకు చేరేలా చూడండి అని సోషల్‌ మీడియాలో పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement