కడప వైఎస్ఆర్ సర్కిల్ : మంగళగిరిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) నిర్వహించనున్న ఉమెన్ ఆంధ్ర ప్రీమియం లీగ్(డబ్ల్యూ ఏపీఎల్) సీజన్–1 క్రికెట్ టోర్నమెంట్లో రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు విజయం సాధిస్తుందని రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు ఓనర్లు రాజారెడ్డి, అమర్ బాబు విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మహిళా క్రికెట్ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎంతగానో ప్రోత్సహిస్తుందన్నారు. ఇందులో భాగంగా తొలిసారి ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19 నుంచి ఉమెన్ ఆంధ్ర ప్రీమియం లీగ్ (డబ్ల్యూ ఏపీఎల్) సీజన్ –1 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుందన్నారు. ఇందులో నాలుగు జట్లు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. రాయలసీమ జెన్ స్టార్స్, అమరావతి ఈ– ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్లు ఉమెన్ ఆంధ్ర ప్రీమియం లీగ్(డబ్ల్యూ ఏపీఎల్)లో తలపడనున్నాయన్నారు. రాయలసీమ జెన్ స్టార్స్ జట్టుకు శ్రీచరణి కెప్టెన్గా వ్యవహరిస్తున్నారని, అయితే అంతర్జాతీయ కిక్రెట్ జరుగుతున్న నేపథ్యంలో ఇండియా క్రీడాకారులు పద్మజ కెప్టెన్గా, వైస్ కెప్టెన్గా అనూష వ్యవహరిస్తున్నారన్నారు. రాయలసీమ బౌలింగ్, బ్యాటింగ్లో బలంగా ఉన్న జట్టు అని అన్నారు. రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ దీవించాలన్నారు. శనివారం కడప నగర శివార్లలోని కేఎస్ఆర్ఎం క్రికెట్ స్టేడియంలో జెర్సీ లాంచ్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జట్టు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న సినీ హీరోయిన్ నిధి అగర్వాల్, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో కడప క్రికెట్ స్టేడియం కమిటీ చైర్మన్ ఆర్.శ్రవణ్ రాజ్రెడ్డి, జట్టు కోచ్ సురేష్, మెంటర్ పైడి కాల్వ విజయ్కుమార్ పాల్గొన్నారు.
రాయలసీమ జెన్ స్టార్స్
జట్టు కప్ గెలుస్తుంది
ఆ జట్టు ఓనర్స్ రాజారెడ్డి, అమర్బాబు


