కడప ఎడ్యుకేషన్: జన విజ్ఞాన వేదిక (జేవీవీ)ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన చెకుముకి సైన్స్ సంబరాలు పాఠశాల స్థాయి నుంచి మండల స్థాయి వరకు విజయవంతంగా కొనసాగాయని జేవీవీ కడప జిల్లా కమిటీ తెలిపింది. జిల్లాలోని 20 మండలాల నుంచి 20 వేలకు పైగా విద్యార్థులు చెకుముకి సైన్స్ సంబరాల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొంది. విద్యార్థుల్లో విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించడం, ప్రశ్నించే తత్వం, పరిశీలనా దృష్టి, శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే చెకుముకి సైన్స్ సంబరాల ప్రధాన ఉద్దేశమని వారు అన్నారు. కడప నగరంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో కడప పట్టణానికి సంబంధించిన 50 పాఠశాలల నుంచి 160 మంది విద్యార్థులు మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో పాల్గొన్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల విభాగంలో నాగరాజుపేట ఎంసీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల నుంచి షేక్ అమియా అజీమ్, ఎస్. నఫీసా బి., తారక రామ్ పాల్గొననున్నారు. ప్రైవేట్ పాఠశాలల విభాగంలో సీఎంఆర్ పల్లె స్కైల్యాండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి టి. సాయి చందన, జి. మానసవీణ, కె.ఈ. శ్రీత జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. సెప్టెంబర్ 27న కడప ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించనున్నట్లు జేవీవీ జిల్లా కమిటీ తెలిపింది. కార్యక్రమంలో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వీర సుదర్శన్ రెడ్డి, జేవీవీ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, శివరాం, శ్రీకాంత్, కుమారస్వామి రెడ్డి, జింక రవి, సమతా నాయకురాలు సునీత, అరుణ, రామసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.


