రాజంపేట : పట్టణంలోని చిన్నచావిడి వీధిలో హైవే పెట్రోలు సిబ్బందిలో ఒకరు హల్చల్ చేసినట్లు గురువారం స్ధానికుల నుంచి ఆరోపణలు వెలువడ్డాయి. ఓ ఆటోలో ప్రయాణిస్తున్న హైవే పెట్రోలు సిబ్బంది ఎదురుగా వస్తున్న మరో ఆటోను వెనక్కి వెళ్లాలని సూచించారు. అయితే ట్రాఫిక్ ఉండటంతో వెనక్కి వెళ్లలేకపోయారు. వీలు లేని పరిస్ధితి ఉందని ఆటోడ్రైవర్ తెలిపారు. ఈనేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.. నాకే ఎదురుచెపుతావా అంటూ ఆటోడ్రైవర్ చొక్కా పట్టుకున్నారు. దురుసుగా ప్రవర్తించారు. దాడికి ప్రయత్నించినట్లు స్థానికులు ఆరోపించారు.హైవేపెట్రోలు సిబ్బంది హైవేలో ఉండాల్సిందిపోయి, నిబంధనలను అతిక్రమించారని విమర్శించారు. నడిరోడ్డులో జనం సాక్షిగా జరిగిన ఈ సంఘటనపై పలువురు హైవే పోలీసుల తీరుపై పెదవివిరస్తున్నారు. మద్యం మత్తులో ఈ గొడవ జరిగినట్లు తెలిసింది. ఆటోడ్రైవరు, హైవే పెట్రోలు ఖాకీని పట్టణ పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారు.
మహిళ పై కత్తితో దాడి: కేసు నమోదు
కమలాపురం : మండలంలోని టి.చదిపిరాళ్ల ఎస్సీ కాలనీకి చెందిన బెల్లం మేరిపై అదే కాలనీకి చెందిన జయవర్ధన్ అలియాస్ కన్నా అనే వ్యక్తి కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేరి తన ఇద్దరు కుమారులతో కలసి టి.చదిపిరాళ్ల ఎస్సీ కాలనీలో నివసిస్తోంది. ఉపాధి, వ్యవసాయ పనులకు వెళుతూ జీవనం సాగిస్తోంది. కాగా మేరి ఇంటి ఎదుటే ఉన్న జయవర్ధన్ అలియాస్ కన్నా రోజూ తన ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ, ఇంటి ఎదుటే మూత్రం పోస్తూ మేరిని వేధించేవాడు. గురువారం కూడా మేరి ఉపాధి పనులకు వెళ్లి ఇంటికి వచ్చాక కన్నా తిడుతున్నాడు. రోజు ఏందిరా వేధింపులు అని అతని ఇంటి గేటు వద్దకు వెళ్లి మేరి ప్రశ్నించగా జుత్తు పట్టుకుని తన ఇంట్లోని వంటగదిలోకి తీసుకెళ్తి కత్తితో పలు చోట్ల పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. మేరి కేకలు వేయడంతో కాలనీ వాసులు కన్నా ఇంట్లోకి వెళ్లి రక్షించారు. తీవ్ర రక్త స్రావంతో ఉన్న ఆమెను 108 వాహనంలోచికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మేరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు ప్రకాశం జిల్లాలో బీటెక్ చదువుతుండగా మరో కుమారుడు డిక్సన్లో పని చేస్తున్నారు. జయవర్ధన్ పక్షవాతం బారిన పడిన తన తల్లితో కలసి నివసిస్తున్నాడు. కాగా జయవర్ధన్ మానసిక పరిస్థితి సరిగా లేనట్లు స్థానికులు తెలిపారు.
జనం సాక్షిగా దౌర్జన్యకర సంఘటన


