కడప అర్బన్ : బాలలతో భిక్షాటన చేయించడం, వారిని బాలకార్మికులుగా మార్చడం వంటి చర్యలను పూర్తిగా అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు కె.జి. పద్మలత అధికారులను ఆదేశించారు. కడప జిల్లాలో గురువారం పర్యటించిన ఆమె పలు సంక్షేమ కేంద్రాలు, ఆసుపత్రులు, కారాగారాలు, వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలల సంక్షేమం, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ సేవలు ప్రతి చిన్నారికి సమర్థవంతంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పుట్టంపల్లి యానాది కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం, వైద్య సేవలను పరిశీలించారు. కడప కేంద్ర కారాగారం, మహిళా జైలును తనిఖీ చేసిన మహిళా కమిషన్ సభ్యురాలు ఖైదీలకు కల్పిస్తున్న వసతులు, భోజనం, వైద్య సేవల గురించి ఆరా తీశారు. 18 సంవత్సరాల లోపు వయసున్న మైనర్లు ఎవరైనా రిమాండ్లో ఉన్నారా అనే అంశంపై ప్రవేశ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. జీజీహెచ్ (రిమ్స్)లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం, పిల్లల వార్డులను తనిఖీ చేసి వైద్య పరికరాల లభ్యత, చిన్నారులకు అందుతున్న అత్యవసర వైద్య సేవలను పరిశీలించారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారిణి పి. రమాదేవి, జిల్లా మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి సమన్వయకర్త ఎం. శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


