చక్రాయపేట : మండలంలోని సురభి గ్రామం రెడ్డివారిపల్లె మాలపల్లెలో గొంగటి అనూరాధ (40)ను ఆమె భర్త గొంగటి నాగార్జున హత్య చేశాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. కుమారుడు రుద్రదీప్ ఫిర్యాదు మేరకు ఆర్కే వ్యాలీ సీఐ శంకర్రెడ్డి,ఎస్సై చంద్ర శేఖర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనూరాధ, నాగార్జున దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. కాలక్రమంలో నాగార్జున తాగుడుకు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కూడా ఇద్ద్దరు తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారు. తెల్లారేసరికి ఇద్దరూ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కొడుకు రుద్రదీప్ సమీప ప్రాంతాల్లో గాలించాడు. తమ ఇంటికి సమీపంలోని గుట్టలో అనూరాధ శవమై కనిపించిందని.. తన తండ్రి నాగార్జునే బండ రాయితో కొట్టి హత్య చేసినట్టు అనుమానంగా ఉందని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృత దేహాన్ని శవపరీక్షల నిమిత్తం వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా రాధ హత్యకు అక్రమ సంబంధాలే కారణమని గతంలో కూడా పలుమార్లు పోలీస్ స్టేషన్లకు వెళ్లి పంచాయతీలు చేసుకున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు.


