చింతకొమ్మదిన్నె మండలంలోని రైతుల పొలాల్లో 765 కేవీ విద్యుత్ హై ఓల్టేజీ లైన్ అలైన్మెంట్ మార్చాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా రాజుల మల్లారెడ్డి, సీకే దిన్నె బాధిత భూ యజమానులతోపాటు ఏపీ రైతు సంఘం నాయకుడు దస్తగిరిరెడ్డి మాట్లాడుతూ రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని పచ్చని పొలాల్లో విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని సత్వరమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీకే దిన్నె మండలంలో 765 కేవీ విద్యుత్ హై ఓల్టేజ్ లైన్ అలైన్మెంట్ మార్చాలంటూ కోరుతుండగా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. పంట పొలాలకు ఎలాంటి నష్టం లేకుండా 765 కేవీ విద్యుత్ లైన్ వేసుకునే ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు చూసుకోవాలన్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ లైన్లు వేయాలని, చిన్న రైతుకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలతోపాటు పలువురు బాధిత రైతులు పాల్గొన్నారు.


