జమ్మలమడుగు : మండల కేంద్రమైన మైలవరంలో ట్రాక్టర్ దుకాణంలోనికి దూసుకుపోయింది. అప్రమత్తమైన స్థానికులు పరుగులు తీశారు. ఒకరికి స్వల్పగాయాలయ్యాయి. స్కూటర్ దెబ్బతింది. సోమవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఓ మైనర్ బాలుడు ఖాళీ ట్రాక్టర్ను మైలవరం పాత బస్టాండ్ నుంచి గురుకుల పాఠశాల రోడ్డువైపునకు పోతున్న సమయంలో కంట్రోల్ చేయలేక నేరుగా దుకాణంలోనికి పోనిచ్చినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాని పరిశీలించారు. ట్రాక్టర్ను బయటికి తీయించి స్టేషన్కు తరలించారు. మైనర్లు వాహనాలు నడుపడంతో ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఎప్పుడు రద్దీగా ఉన్న పాత బస్టాండ్లో సోమవారం పెద్దగా జనాలు లేకపోవడం వల్ల పెద్దప్రమాదమే తప్పింది. లేకపోతే ప్రాణ నష్టం జరిగి ఉండేదని, మైనర్లు వాహనాలు నడుపకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అయినవారు ఉన్నా అనాథలా మృతి!
పామిడి: అయినవారు పట్టించుకోకపోవడంతో మనసు చంపుకొని ఇల్లు వదిలివచ్చిన ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పామిడి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం ఈరన్నపల్లికి చెందిన చింతాకుల అశోక్ 25 ఏళ్ల క్రితం వ్యాపార రీత్యా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లి స్థిరపడ్డాడు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఇటీవల అశోక్ అనారోగ్యం బారిన పడ్డాడు. కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై 6 నెలల క్రితం ఇల్లు వదిలి వచ్చాడు. రెండు రోజులుగా పామిడి కమ్యూనిటీ ఆసుపత్రిలో తిరుగుతూ ఆసుపత్రి ప్రాంగణంలో నిద్రించేవాడు. ఆదివారం రాత్రి నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచాడు. పామిడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుమారుడు, ప్రొద్దుటూరుకు చెందిన హరికృష్ణకు సమాచారం చేరవేశారు.
● మైనర్ నడపటంతోనే ప్రమాదం


