● జాయింట్ కలెక్టర్ నిధిమీనా
● అత్యుత్తమ సేవలందించిన 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జేసీ నిధీమీనా పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మహాన్నత వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం కడప కలెక్టరేట్ సభాభవన్లో డీఈఓ షేక్ షంషుద్దీన్ అధ్యక్షతన నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ చదువుకున్న ప్రతి ఒక్కరూ తమకు విద్యను, జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులను ఎప్పటికీ మరిచిపోరాదన్నారు. మార్గదర్శకులైన గురువులకు ఈ సమాజంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. డీఆర్వో మల్లికార్జునుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల చదువుతోపాటు వారి నడవడికను గమనించాలన్నారు. గ్రంథాలయ చైర్మన్ భానుప్రకాశ్, జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతికత కేవలం సమాచారాన్ని ఇస్తుందని.. విద్యార్థి ఓటమి సమయంలో ధైర్యం చెప్పి, ‘నేనున్నాను’ అంటూ ముందుకు నడిపించేది గురువు మాత్రమే అని అన్నారు. సమగ్రశిక్ష జిల్లా కో–ఆర్డినేటర్ అనురాధ మాట్లాడారు. అనంతరం జిల్లాలోని ఉత్తమ సేవలు అందించిన 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేయడంతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారులు రాజగోపాల్ రెడ్డి, శివప్రసాద్, నాగరాజు, డీఎస్ఓ బాలాజీ, మాజీ డీఎస్ఓలు రెహమాన్, నిత్యానందరెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.


