● గండిక్షేత్రంలో ముగిసిన శ్రావణమాస
ఉత్సవాలు
చక్రాయపేట: పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో శ్రావణ మాసం చివరి శనివారోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని పరవశించి పోయారు. వాహనాలను పోలీసులు అద్దాలమర్రి, ఇడుపుల పాయ క్రాస్ల వద్దనే నిలిపి వేశారు.దీంతో భక్తులు కాలినడకన గండికి చేరుకున్నారు. కొందరు భక్తులు వేంపల్లె చక్రాయపేట,నాగలగుట్టపల్లె,వేముల తదితర ప్రాంతాల నుండి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.భక్తుల కోసం గండి శ్రీవాసవీ నిత్యాన్నదాన సత్రం,గండి భజనమండలి తరపున నందారపు చెన్నకృష్ణారెడ్డితో పాటు పలు చోట్ల దాతలు అన్నదానాలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్ చైర్మన్ వెంకటస్వామి పాలకమండలి సభ్యులుతో పాటు పులివెందుల డీఎస్పీ మురళి ఆర్కేవ్యాలీ సీఐ శంకర్రెడ్డి,ఆర్కేవ్యాలీ ఎస్ఐ శ్రీప్రియ ఆధ్వర్యంలో సీఐలు ఎస్సైలు,పోలీసులు బందో బస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిని సాంస్కృతిక కార్యక్రమాలు అలరింప జేశాయి, ఆలయ ప్రధాన,ఉప ప్రధాన,ముఖ్య అర్చకులు కేసరి,రాజారమేష్, రాజగోపాలాచార్యులు, రఘుస్వామి, వేదపారాయణం రామ మోహన శర్మలు స్వామిని ప్రత్యేకంగా అలంకరించిన పూజలు జరిపారు.భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంజన్న సన్నిధిలో శనివారం భక్తులు అధికంగా రావడంతో లడ్డూ ప్రసాదాలు తక్కువ వచ్చాయి.దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలియగానే ఆలయ అధికారి లడ్డూ ప్రసాదాలను తయారు చేయించి భక్తులకు అందేలా చర్యలు చేపట్టారు.
వైభవంగా స్వామి వారి క్షేత్రోత్సవం ఆస్థానం
శ్రావణ మాసం ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారి క్షేత్రోత్సవం,ఆస్థానం కార్యక్రమాలను నిర్వహించారు,ప్రత్యేక పల్లకిలో ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు.అనంతరం పాపాఘ్ని నదిలో ఆస్థానం నిర్వహించి ఈ ఏడాది శ్రావణ మాస ఉత్సవాలను ముగించారు.


