కడప సిటీ : హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం కడప కలెక్టరేట్లో పీఆర్సీ, ఉద్యోగుల బకాయిల సాధన కోసం లంచ్ అవర్ డెమానెస్ట్రేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా కృష్ణకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషన్ను నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. ఏపీపీ టీడీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అన్ని బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అన్ని డిపార్టుమెంట్లు జేఏసీ అమరావతికి సంఘీభావం ప్రకటించి ఉద్యమించాలన్నారు. పదోన్నతులపై తక్షణ చర్యలు తీసుకుని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఉన్న ప్రతి ఉద్యోగి ఏపీ జేఏసీలో పాల్గొని ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల పక్షాన ఏపీ జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు తన బాద్యతగా ఉద్యోగుల పక్షాన తమ గొంతుకను వినిపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి ఎన్.రాజశేఖర్, కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రతాప్రెడ్డి, వెంకటస్వామి పాల్గొన్నారు.


