సిద్ధవటం : భూ కబ్జాదారులు ప్రభుత్వ స్థలాన్ని జేసీబీ యంత్రంతో చదును చేసి కబ్జా చేశారు. సిద్దవటం మండలంలోని మాధవరం, 1,2,3, గ్రామం శాఖరాజుపల్లె రెవెన్యూ సర్వే నంబర్,425/1లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ప్రభుత్వ స్థలం 10 సెంట్లు కబ్జా చేశాడు. గురువారం స్థానికులు చెప్పిన కథనం ప్రకారం ఒంటిమిట్ట గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి మంగళవారం జేసీబీ యంత్రంతో చదును చేశాడని, ప్రభుత్వ స్థలాలు కనపడితే స్థానికులు కాకుండా ఇతర కొత్త వ్యక్తులు కబ్జా చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ భూమి, స్థలాలు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఈ విషయమై తహసీల్దార్ విజయకుమార్ వివరణ కోరగా మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో శాఖరాజు పల్లెరెవెన్యూ పొలం కబ్జా చేసిన వ్యక్తిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
భార్యా భర్తలపై దాడి
వీరపునాయునిపల్లె : వీరపునాయునిపల్లెకు చెందిన ప్రసాద్ అలియాస్ పేరూరి వెంకట నాగప్రసాద్ అతని భార్య లక్ష్మీప్రసన్నలపై గురువారం ఉదయం దాడి జరిగింది. ఈ దాడిలో ప్రసాద్కు తీవ్రగాయాలు కాగా లక్ష్మి ప్రసన్నకు స్వల్ప గాయాలయయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రసాద్ అన్ని శాఖల అధికారులపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తుండేవాడని, అదే క్రమంలో పాయసంపల్లెకు చెందిన అన్నారెడ్డి గంగిరెడ్డి కందుల సుదర్శన్రెడ్డి లింగాల పొలంలో సర్వే నంబర్ 520లో భూములు ఆక్రమించుకొన్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం ప్రసాద్ బావమరిది సుదర్శన్రెడ్డి,గంగిరెడ్డి ఫోన్లో వాదించుకోవడం జరిగిందని ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. అదే క్రమంలో గురువారం ఉదయం ప్రసాద్ ఆయన భార్య లక్ష్మి ప్రసన్న ఇద్దరు కలసి గంగిరెడ్డిపల్లెలోని గోశాల వద్దకు వెలుతుండగా సంగాలపల్లె, గంగిరెడ్డిపల్లె గ్రామాల మధ్య వాహనాన్ని అడ్డగించి కందుల సుదర్శన్ రెడ్డి, అన్నారెడ్డి గంగిరెడ్డి, హర్షవర్దన్ రెడ్డిలు కలిసి దాడిచేశారు. ప్రసాద్ భార్య పిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
దత్తాపురంలో చోరీ
కొండాపురం : మండల పరిధిలోని సుగుమంచిపల్లె పునరావాస కేంద్రంలో దత్తాపురం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన గురువారం జరిగింది. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ మంజునాథ వివరాల మేరకు.. తలారి లక్ష్మీనారాయణ, తన భార్యతో కలిసి వ్యవసాయ పనుల కోసం వెళ్లారు. ఆయన తల్లి పక్కనే ఉన్న ఇంటిలో ఉంటుంది. తన కుమారుడి ఇంటి వైపు చూడగా తాళం పగలగొట్టి ఉంది. వెంటనే కుమారుడికి ఫోన్ చేసి చెప్పగా ఇంటికి వచ్చి చూస్తే బీరువా లో రూ.20 వేల నగదు దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


