జమ్మలమడుగు/మైలవరం : కార్పొరేట్ కంపెనీలు సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, ఉత్పత్తి అయిన విద్యుత్ను పవర్గ్రిడ్కు కలపడం కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు, లైన్లు రైతుల పొలాల్లో పోవడం వల్ల భూములకు విలువ తగ్గిపోతుందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు గురువారం మైలవరం మండలంలోని వేపరాల గ్రామంలోని రైతుల పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్టవర్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలు విద్యుత్ ఉత్పత్తి చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. కానీ రైతులకు పరిహారం ఇవ్వకుండా వారి పంట పొలాల్లో టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన రైతులను పోలీసు, రెవెన్యూ అధికారులతో బెదిరిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం చట్ట రీత్యానేరం అంటున్నారే తప్ప రైతులకు రావాల్సిన పరిహారం గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు.. పరిహారం అరకొర కాకుండా పది లక్షల రూపాయల వరకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రిడ్ కంపెనీలు చేపడుతున్న టవర్లను రైతుల భూముల్లో పెట్టనిచ్చే పరిస్థితి లేదన్నారు. అలా ఎవరైనా చేస్తే అన్యాయం జరిగిన రైతులతో కలసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కొమెర్ల మోహన్రెడ్డి, జగదీశ్వరరెడ్డి వేపరాల గ్రామ రైతులు పాల్గొన్నారు.
రైతులకు పరిహారం ఇవ్వాలని
ఎమ్మెల్సీ డిమాండ్


