కమలాపురం : మండల పరిధిలోని జి. అప్పాయపల్లెకు చెందిన బోదం వెంకట సోమిరెడ్డి(54) ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం రోజూ లాగే సోమిరెడ్డి పొలానికి, ఆయన భార్య చంద్రావతి ఉపాధి పనులకు వెళ్లారు. అయితే ఏమి జరిగిందో ఏమో సోమిరెడ్డి తిరిగి ఇంటికి వచ్చి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరి వేసుకునే సమయంలో హైదరాబాద్లో ఉన్న తన మేనల్లుడుకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. అతడు ఈ విషయం బంధువుల ద్వారా మృతుని భార్యకు తెలియజేశాడు. విషయం తెలుసుకున్న భార్య ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతున్నాడు. బంధువులు, స్థానికులు కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. వ్యవసాయం చేసుకుంటూ భార్య భర్తలు అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారని, ఇలా ఎందుకు చేశాడోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మృతుని పెద్ద కుమారుడు లండన్లో, చిన్న కుమారుడు విజయవాడలో ఉన్నత చదువులు చదువుతున్నారు. సోమిరెడ్డి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


