కడపసెవెన్రోడ్స్ : భవిష్యత్తులో చేనేత కళాకారులకు స్వర్ణయుగం రానుందని, చేనేత ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ను అందుబాటులోకి తీసుకువస్తామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో చేనేత, జౌళి సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా కలెక్టర్ హాజరై ప్రసంగించారు. మగ్గాలనే నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్నల సేవలో’ పథకం ద్వారా మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. మార్కెటింగ్ పరంగా జిల్లా యంత్రాంగం తరఫున చేనేతల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ‘నేతన్న సేవలో..’ పథకం కింద జిల్లాలో 8,713 మంది అర్హులుగా గుర్తించగా వారికి రూ.21.78 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు చేనేతకారులను కలెక్టర్ సన్మానించారు. అంతకుముందు నగరంలో చేనేత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు అహ్మద్ మోహిద్దీన్, చేనేత జౌళి శాఖ డెవలప్మెంట్ ఆఫీసర్ సత్యంబాబు, జాతీయ చేనేత ఐక్యవేదిక నాయకులు అవ్వారు మల్లికార్జున పాల్గొన్నారు.
జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి


