● మనో వేదనలో ఉపాధ్యాయులు
● పని పాత బడిలో... జీతం కొత్త పాఠశాలలో
కడప ఎడ్యుకేషన్: పాపం ఆ అయ్యవార్లు ... అందరి లాగే వారు కూడా ఎన్నో ఏళ్ల నుంచి దూర ప్రాంత పాఠశాల్లో పనిచేశారు. తర్వాత వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. బదిలీ అయిన స్థానాలకు వెళదామంటే వారిస్థానంలో పనిచేసేందుకు ఏ ఉపాధ్యాయుడు రావడం లేదు. ఇందుకు అయ్యవార్ల కొరతే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో గతేడాది బదిలీ అయినా నేటికి పాత పాఠశాలల్లోనే కునారిళ్లుతున్నారు. కనీసం వ్యక్తిగత పనిపై సెలవులో వెళ్లాలంటే రెండు ప్రాంతాల ఎంఈఓల అనుమతి తీసుకోవాల్సి రావడంతో అందోళన చెందుతున్నారు. ఈ ఏడాదైనా వారిని రిలీవ్ చేస్తారనుకుంటే జిల్లా విభజన కారణంగా అది కూడా జరలేదు. దీంతో చాలామంది వయోవృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాసింత వయసు ఉన్నప్పుడు దూర ప్రాంతాల్లో సర్వీసు పూర్తి చేసుకుంటే వయసు మళ్లిన తరువాత దగ్గర ప్రాంతాలకు బదిలీలు కావచ్చన్న వారి ఆశలు అడియాసలుగానే మిలిగి పోతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా గతేడాది..
రాష్ట్రవ్యాప్తంగా 2025 జూన్ నెలలో ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. నేటికి బదిలీలు పొందిన టీచర్లు వారి స్థానాల్లో చేరకుండా పాత పాఠశాల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. కడప జిల్లాలో దాదాపు 142 మంది టీచర్లు రిలీవర్లు కాని కారణంతో కొత్త బడుల్లో జీతం తీసుకుంటూ పాత బడుల్లో బోధన చేస్తున్నారు. గత ఏడాది మెగా డీఎస్సీ నియమకాలు పూర్తవుతూనే వారిని కొత్త బడులకు పంపి పాత అయ్యవార్లను రిలీవ్ చేస్తుందనుకుంటే ఆచరణలో పూర్తిస్థాయిలో అమలు చేయలేక పోయింది. కొద్ది మందిని మాత్రమే రిలీవ్ చేశారు. ఆ తరువాత అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించి మిగతా వారిని రిలీవ్ చేస్తామని చెప్పారు. అది కూడా పూర్థిస్థాయిలో అమలు చేయలేదు. జిల్లాలో 142 మంది అయ్యవార్లు రిలీవర్ల కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం గత ఏడాది విద్యా సంవత్సరం ముగిసే చివరి రోజైనా రిలీవ్ చేస్తారని అశతో ఎదురు చూశారు. జిల్లాల విభజన సాగుతోందని ఈ ఏడాది టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టలేదు. విద్యాశాఖ కమిషన్ నిర్వహించే శుక్రవారం సమావేశాల్లో బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఎన్నిసార్లు విన్నమించినా ఫలితం లేక పోయింది.
ఈ ఏడాది ఎంటీఎస్ ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించి రిలీవ్ కాని వారి స్థానాల్లో వీరిని నియమించి రిలీవ్ చేస్తామని చెప్పారు. అది కూడా అచరణలో అమలు కాలేదు. ఈ ఏడాది జూన్ 30 నాటికి విద్యార్థుల సంఖ్య అధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి వారిని రిలీవ్ చేస్తామన్నారు. అది కూడా అమలుకు నోచుకోలేదు. ఇప్పుడేమో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లును నియమించి వారిని రీలీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఆచరణలో ఎప్పటికి అమలవుతుందో వేచి చూడాల్సిందే. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించి దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న మాకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


