●నిరాశ పడొద్దు.. ఓపికతో శ్రమిస్తే కొలువు మీదే! | - | Sakshi
Sakshi News home page

●నిరాశ పడొద్దు.. ఓపికతో శ్రమిస్తే కొలువు మీదే!

Jul 26 2026 2:02 AM | Updated on Jul 26 2026 2:02 AM

●నిరాశ పడొద్దు.. ఓపికతో శ్రమిస్తే కొలువు మీదే!

సంకల్పం ఉంటే కొలువులకు కొదవలేదు

ఒకే ఏడాదిలో 13 కేంద్ర ప్రభుత్వ

ఉద్యోగాలు సాధించిన కడప కుర్రాడు

కరోనా సంక్షోభం.. ప్రైవేట్‌ అభద్రతను

అధిగమించి అపూర్వ విజయం

ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ ఈఎస్‌ఐసీ

బ్రాంచ్‌ మేనేజర్‌గా నాగేంద్రసాయి

కడప ఎడ్యుకేషన్‌: సాధించాలనే బలమైన సంకల్పం, పట్టుదలే పెట్టుబడిగా శ్రమిస్తే సొంతం కాని విజయం లేదని నిరూపించాడు వైఎస్సార్‌ జిల్లా కేంద్రం కడప నగరానికి చెందిన యువకుడు లొమడ నాగేంద్రసాయి. తన తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని, పట్టువిడవని విక్రమార్కుడిలా పోరాడి ఏకంగా ఒకే సంవత్సరంలో 13 కేంద్ర ప్రభుత్వ కొలువులు కై వసం చేసుకుని నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు.

విద్యాభ్యాసంలో టాప్‌

కడప నగరంలోని రాజారెడ్డి వీధికి చెందిన అశ్వనికుమార్‌ (ఏపీఎస్‌ఆర్టీసీ పదవీ విరమణ పర్సనల్‌ ఆఫీసర్‌), రాజరాజేశ్వరి (పెండ్లిమర్రి జెడ్పీ హైస్కూల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌)ల కుమారుడైన నాగేంద్రసాయి ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే చదువులో ప్రతిభ కనబరిచాడు. కడప భారతి స్కూల్‌లో 1 నుంచి 7వ తరగతి, విద్యాధరి స్కూల్‌లో 8 నుంచి 10వ తరగతి (10వ తరగతిలో 9.7 జీపీఏ) చదివాడు. హైదరాబాద్‌ ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ పూర్తి చేసి 974 మార్కులు సాధించాడు. ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకుతో పశ్చిమ బెంగాల్‌లోని ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇండస్ట్రియల్‌ అండ్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు (బీటెక్‌ + ఎంటెక్‌) పూర్తి చేశాడు.

సాఫ్ట్‌వేర్‌పై కరోనా దెబ్బ..

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా..

నాగేంద్రసాయి చదువు ముగిసే సమయానికే ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించింది. ఆ తరుణంలో ఐటీ రంగం సంక్షోభంలో పడి, పలు కంపెనీలు చాలా మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించాయి. ఎంతోమంది నిరుద్యోగులుగా మారడం కళ్లారా చూసిన సాయి.. ప్రైవేటు ఉద్యోగాల్లో భద్రత ఉండదని గ్రహించాడు. తన తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో, వారి బాటలోనే నడవాలనే బలమైన బీజం అతని మనసులో నాటుకుంది. కరోనా తగ్గుముఖం పట్టే వరకు ఇంట్లోనే ఉండి స్వయంగా ప్రిపరేషన్‌ సాగించాడు.

తొలి ఓటమి నేర్పిన పాఠం

మొదటిసారి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్ష రాసినప్పుడు కేవలం ఒకే ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేయడం, నార్మలైజేషన్‌ ప్రక్రియ వల్ల స్కోర్‌ తగ్గడంతో తృటిలో ప్రభుత్వ కొలువును మిస్‌ చేసుకున్నాడు. ఈ తొలి ఓటమికి ఏమాత్రం కుంగిపోకుండా, తన లోపాలను సరిదిద్దుకుని మరింత పట్టుదలతో తదుపరి పరీక్షలకు సిద్ధమయ్యాడు.

2025లో కొలువుల జాతర

ఆ తర్వాత 2025లో హైదరాబాద్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో చేరుకుని.. నోటిఫికేషన్‌ పడిన ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటూ కఠిన ప్రిపరేషన్‌ సాగించాడు. ఒక్కసారి లోపాలు తెలుసుకున్న నాగేంద్రసాయి, ఆ తర్వాత జరిగిన పరీక్షల్లో విశ్వరూపం ప్రదర్శించి ఒకే ఏడాదిలో వరుసగా 13 కేంద్ర ప్రభుత్వ కొలువులను సాధించి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం నాగేంద్రసాయి తాను సాధించిన ఉద్యోగాలలో అత్యుత్తమమైన దాన్ని ఎంచుకుని, తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్య్సూరెన్స్‌ కార్పొరేషన్లో బ్రాంచ్‌ మేనేజర్‌ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కడప జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలిపిన నాగేంద్రసాయి ప్రతిభపై పలువురు విద్యావంతులు, ఉన్నతాధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఒకే ఏడాదిలో సాధించిన

13 కేంద్ర ప్రభుత్వ కొలువులు ఇవే:

ఎయిమ్స్‌ : సోషల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ఎయిమ్స్‌ , అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌ సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌, అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌ గ్రేడ్‌–2స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, సర్వేయర్‌ ఆఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, అసిస్టెంట్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌ ఆఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ , అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, టెలికాం అసిస్టెంట్‌ ఆఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, ఫ్యూమిగేషన్‌ అసిస్టెంట్‌ ఆఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, సర్వైలెన్స్‌ అసిస్టెంట్‌ ఆఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, ఫీల్డ్‌మెన్‌ ఆఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటర్‌ అండ్‌ హెచ్‌ఆర్‌ సెలక్షన్‌ కమిషన్‌, అసిస్టెంట్‌ విలేజ్‌ ఇండస్ట్రీ అడ్మినిస్ట్రేటర్‌.

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే నైపుణ్యంతో పాటు ఎంతో ఓపిక, సహనం అవసరం. మొదటి ప్రయత్నంలోనే విజయం రాలేదని ఏమాత్రం కుంగిపోకూడదు. ఓటమిని ఒక పాఠంగా మార్చుకుని, పట్టుదలతో మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. అప్పుడే లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా 10 నుంచి 12 గంటల పాటు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. కేవలం చదవడం మాత్రమే కాదు, అన్ని సబ్జెక్టులపై సంపూర్ణమైన అవగాహన, పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కుటుంబం, ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి లభించే మానసిక మద్దతు, ప్రోత్సాహం ఎంతో కీలకం. – లొమడ నాగేంద్రసాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement