బద్వేలు: ఎత్తిరాజుపల్లె గ్రామానికి చెందిన గొర్లకుంట చెరువును దురాక్రమణ చేసిన వారిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని బద్వేలు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ.చంద్రమోహన్ హెచ్చరించారు. శుక్రవారం పత్రికలో వచ్చిన ‘గొర్లకుంట.. అక్రమాల పంట’ కథనానికి తక్షణమే స్పందించారు. ఆక్రమణలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, సమగ్ర నివేదిక సమర్పించాలని బద్వేలు తహసిల్దార్ను ఆదేశించినట్లు తెలిపారు. గ్రామాల్లో చెరువులను దురాక్రమణ చేయడం క్షమించరాని నేరమని, ఆక్రమణలను పూర్తిగా తొలగించి రైతులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై బద్వేలు తహసిల్దార్ తిరుమల బాబు మాట్లాడుతూ.. ఆర్డీఓ ఆదేశాల మేరకు గొర్లకుంట చెరువు దురాక్రమణపై తక్షణమే విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసిందని, ఈ విధుల్లో సిబ్బంది బిజీగా ఉన్నందున శనివారం నుండి నేరుగా క్షేత్రస్థాయిలో చెరువును పరిశీలించి రెండు రోజుల్లో ఆర్డీఓకు పూర్తి నివేదిక సమర్పిస్తామని తహసిల్దార్ స్పష్టం చేశారు.
నేడు శ్రీ ప్రగడ కోటయ్య జయంతి
కడప సెవెన్రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తున్న శ్రీ ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు కడప కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి కోసిగి మల్లికార్జునుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, నేత కార్మికులు, ప్రజలు హాజరుకావాలని ఆయన కోరారు.
27, 28 తేదీల్లో హాజరుకావాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 27, 28 తేదీలల్లో డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలకు 2026–27 సంవత్సరం ప్రవేశాలకు 4 నుంచి 9 తరగతుల వరకు ఎంపికై న విద్యార్థులు హాజరుకావాలని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాల ప్రత్యేక అధికారి కె. జగన్నాధరెడ్డి తెలిపారు. ఎంపికై న విద్యార్దులకు ఇప్పటికే విజయవాడ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్ద ఎస్ఎంఎస్, ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందించడం జరిగిందన్నారు. హాజరయ్యే విద్యార్దులు విద్యార్దుల ఆధార్ కార్డు, స్టడీ, ఇతర ఒరిజనల్ సర్టిఫికెట్లను తీసుకొని హాజరుకావాలన్నారు.
ఇల్లు కూల్చిన కేసులో
ఇద్దరు అరెస్ట్
కడప అర్బన్: కడపలోని ఎర్రముక్కపల్లెలో ఈ ఏడాది జనవరి 26వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఇల్లును కూల్చివేసిన సంఘటనలో నజీర్, ప్రసాద్రెడ్డిలను ప్రస్తుత సీఐ ఎం. తిమ్మారెడ్డి తమ సిబ్బందితో కలిసి శనివారం అరెస్ట్ చేశారు. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా రిమాండ్కు తరలించారు.
గ్రామాల అభివృద్ధికి
ప్రణాళికలు తయారీ
కడప సెవెన్రోడ్స్ : గ్రామాల్లో ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం సాధించడం కోసం ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం అన్నారు. శనివారం జెడ్పీ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో ఎంపీడీఓలు, డీఎల్పీఓలు, డిజిటల్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆయా గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి, స్వయం సహాయక సంఘాలను ప్రణాళిక రచనలో భాగస్వాములు చేయాలని సూచించారు. తాగునీరు, రోడ్లు, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక వసతుల ప్రస్తుత పరిస్థితులు సమీక్షించాలన్నారు. గ్రామానికి తక్షణమే ఏ పనులు అవసరమో గుర్తించి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించాలన్నారు. తయారు చేసిన ముసాయిదా ప్రణాళికను గ్రామసభల్లో చర్చించి ప్రజలందరి సమక్షంలో ఆమోదించాలని తెలిపారు.
నేడు విద్యుత్ బిల్లులు
చెల్లించవచ్చు
కడప కార్పొరేషన్: వినియోగదారుల సౌకర్యార్థం ఈనెల 26వ తేదీ సెలవు దినం అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథాతథంగా పనిచేస్తాయని ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సంస్థ పురోభివృద్ధికి సహకరించాలని కోరారు.


