బ్రహ్మంగారిమఠం : భవిష్యత్తు కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ప్రథమ శిశ్యుడు ముడుమాల సిద్దయ్య నాలుగో కుమారుడు పెద్దపీరయ్య స్వామి ఆరాధన ఉత్సవాలు గురువారం ముడుమాల పంచాయతీ సిద్దయ్యమఠంలో ఘనంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా ఏటా పెద్దపీరయ్య స్వామి ఆరాధన జరుగుతుంది. ఇందులో భాగంగా సిద్దయ్యమఠం ప్రస్తుత పీఠాధిపతులు, వారి సోదరులు ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించారు. భక్తుల కోసం చలువ పందిర్లు, తాగునీరు తదితరాల సౌకర్యాలు నిర్వాహకులు కల్పించారు. వివిధ కులాల సంఘాల వారు అన్నదానాలు ఏర్పాటు చేశారు. రాత్రి భజనలు, నాటకాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బి.మఠం ఎస్ఐ శివప్రసాద్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. ఉత్సవాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి భక్తులు అధికంగా రానున్నారు.
నేటి కార్యక్రమాలు
పెద్దపీరయ్యస్వామి ఆరాధన సందర్భంగా రెండవ రోజు శుక్రవారం ప్రసాద వినియోగంతో ఉత్సవాలు ముగుస్తాయి. మధ్యాహ్నం 3 గంటలకు బండలాగుడు పొటీలు నిర్వహించనున్నారు. ఇందులో గెలుపొందిన ఎడ్లకు ప్రథమ బహుమతి రూ.1లక్ష 116లు జెడ్పీ చైర్మన్ ఎం.రామగోవిందరెడ్డి తన తండ్రి పిచ్చిరెడ్డి పేరున ఇస్తున్నారు. రెండవ బహుమతి రూ.70 వేలు గొడ్లవీడు రామసుబ్బారెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో అందజేస్తున్నారు. మూడవ బహుమతి రూ.45 వేలు, నాల్గువ బహుమతి రూ.30 వేలు, ఐదవ బహుమతి రూ.15 వేలు ఇవ్వనున్నారు. అలాగే 16, 13 మనుముల రాతి గుండు ఎత్తిన వారికి బహుమతులు ఉన్నాయి.


