పులివెందుల రూరల్ : మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన రాజారెడ్డి అరటితోటలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. కొత్తపల్లె రోడ్డు సమీపంలో వైన్ షాపు వెనుకు వైపు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. నిప్పు రవ్వలు వచ్చి సమీపంలోని తోటలో పడటంతో అరటి చెట్లు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఫైర్ స్టేషన్ అధికారులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే చేతికి వచ్చిన అరటి గెలలు, పైపులు పూర్తిగా కాలిపోయాయని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.10 లక్షల నష్టం వచ్చినట్లు ఆయన వాపోయారు. వేసవి కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
బాలుడు బాలల సంక్షేమ సమితికి అప్పగింత
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగరం పాత బస్టాండు పరిసర ప్రాంతాల్లో ఓ బాలుడు తిరుగుతూ ఉండగా పోలీసులు గుర్తించి జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది ద్వారా కడపలోని బాలల సంక్షేమ సమితిలో అప్పగించారు. ఈ బాలుడికి ప్రత్యేక దత్తత సంస్థలో పునరావాసం కల్పించారు. ఇతని తల్లిదండ్రులు, బంధువులు తగిన ఆధారాలతో బాలల సంక్షేమ సమితి, ప్రభుత్వ బాలుర గృహంలో సంప్రదించాలని పోలీసులు తెలియజేశారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
పులివెందుల రూరల్ : మండల పరిధిలోని మోట్నూతలపల్లె గ్రామ సమీపంలో ఆలయానికి వెళ్లే రహదారిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించారు. పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని కడప రోడ్డులో ఉన్న సర్వజన ఆసుపత్రికి తరలించారు. అతను తెల్ల షర్టు, తెల్ల ప్యాంట్ ధరించి ఉన్నాడని గ్రామస్తులు తెలిపారు.
విధులకు ఆటంకం
కలిగించిన కేసులో జైలు
వేంపల్లె : వేంపల్లె పోలీస్స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇద్దరు నిందితులకు జరిమానాతోపాటు జైలు శిక్ష విధించినట్లు సీఐ నరసింహులు తెలిపారు. జనవరి 14న రాత్రి వేంపల్లె ముత్తరాసు వీధికి చెందిన మల్లెపోయిన మల్లికార్జున, దేవళం వీధికి చెందిన శివ పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్పై హత్యాయత్నానికి ప్రయత్నం చేసినట్లు కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై గతంలో ఉన్న సీఐ సురేష్రెడ్డి కేసు నమోదు చేసి చార్జీ సీటు దాఖలు చేశారు. ఏపీపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరిచి సాక్షాధారాలతో నేర నిరూపణ చేయడంతో శుక్రవారం సెవెంత్ అడిషనల్ జడ్జి జీఎస్ రమేష్ కుమార్ తీర్పునిచ్చారు. ఒక్కొక్క ముద్దాయికి రూ.1000 జరిమానాతోపాటు నెల రోజులు జైలు శిక్ష విధించారు.
వరకట్న వేధింపుల కేసు
మదనపల్లెటౌన్ : అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిపై మదనపల్లె తాలకా పోలీసులు శుక్రవారం వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. శ్రీకాళహస్తికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి షాజీద్(28) మదనపల్లె మండలం కొత్తపల్లె గ్రామం కొత్త ఇండ్లకు చెందిన షమీంభానును పెళ్లి చేసుకున్నాడు. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు షమీంభాను పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


